టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు దగ్గుబాటి రానా బుధవారం నాడు విచారణకు హాజరయ్యారు. గతంలో ఎక్సైజ్ శాఖ విచారణ సమయంలో దగ్గుబాటి రానా పేరు లేదు. రానాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానా బుధవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో ఈ కేసును ఎక్సైజ్ అధికారులు విచారణ చేసిన సమయంలో దగ్గుబాటి రానాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు లేవు. అయితే హైద్రాబాద్ లోని మాదాపూర్ లోని ఎఫ్ కేఫ్ లాంజ్ పబ్ లో జరిగిన పార్టీకి దగ్గుబాటి రానాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ హాజరైనట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్లబ్ లో పార్టీకి సంబంధించిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఈడీ అధికారులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ లను విచారించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైంది. మరోవైపు దగ్గుబాటి రానా ఇవాళ విచారణకు హాజరయ్యారు.
హైద్రాబాద్లోని ఓ హోటల్ నుండి తన ఆడిటర్లతో కలిసి రానా ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు. ఎఫ్ కేఫ్ లాంజ్ పబ్ ను గతంలో సినీ నటుడు నవదీప్ నడిపినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.నవదీప్ ఈ పబ్ ను నడిపిన సమయంలోనే ఈ పబ్ లో డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. రానా ఖాతాలతో పాటు రానా కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ సంస్థ నుండి డ్రగ్స్ సరఫరా కోసం నిధులు బదిలీ చేశారా అనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
నవదీప్, రానా మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై కూడ ఈడీ దర్యాప్తు చేయనుంది. డగ్ర్స్, మనీలాండరింగ్ పై కూడ ఈడీ అధికారులు విచారించనున్నారు. టాలీవుడ్కు చెందిన 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపింది. ఇందులో ఇప్పటివరకు నలుగురిని విచారించింది ఈడీ.
పూరీ జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, నందులను ఈడీ విచారించింది. రకుల్ ప్రీత్ సింగ్, నందులు తమను విచారణకు రావాలని కోరిన సమయం కంటే ముందే విచారణకు హాజరయ్యారు. మంగళవారం నాడు నందు విచారణ సమయంలో కెల్విన్ సహా మరో డ్రగ్ సరఫరాదారుడిని కూడ తీసుకొచ్చారు ఈడీ అధికారులు.