పీసీసీ చీఫ్ ఎంపిక పై స్థబ్దత:పెండింగ్ లో ఉంచిన హై కమాండ్
టీపీసీ చీఫ్ పదవి ఎంపికను పార్టీ నాయకత్వం తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టిందని సమాచారం.
హైదరాబాద్:తెలంగాణకు త్వరలో కొత్త పిసిసి చీఫ్ వస్తారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లు కనిపిస్తుంది.ఎన్నికలన్నీ పూర్తి కావడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడే పిసిసి చీఫ్ మార్చి సాధించేది కూడా ఏమీ లేదన్న అభిప్రాయాన్ని సీనియర్ వ్యక్తం చేస్తున్నారట.
Also read:తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కునో: నేతల మధ్య తీవ్ర పోటీ
పిసిసి చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటన చేయడంతో మున్సిపల్ ఎన్నికల అనంతరం నూతన పిసిసి అధ్యక్షుడు వస్తారని పార్టీలో ప్రచారం జరిగింది.
ఢిల్లీ పెద్దలను పీసీ సీ చీఫ్ పదవి కోసం రాష్ట్ర నేతలు పలువురు కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికలు లేకపోవడం రాబోయే ఎన్నికలకు మరో నాలుగేళ్లు గడువు ఉండడంతో పార్టీ హైకమాండ్ పిసిసి చీఫ్ నియామకంలో ఆచితూచి వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం సిఏ ఏ పై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే దీనికి మద్దతు లభిస్తుండడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా పీసీసీ చీఫ్ పై ఢిల్లీ పెద్దలు కసరత్తు చేసే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు తమకు పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కొందరు పార్టీ సీనియర్లు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. సోనియాను కలిసి తనకు పీసీసీ చీఫ్ అవకాశం కల్పించాలని కోరుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలనే ప్రకటించారు.
పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.