సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య: విచారణ కోరుతూ హైకోర్టులో పౌరహక్కుల సంఘం పిటిషన్
సైదాబాద్ ఘటనలో పాల్గొన్న నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
హైదరాబాద్: సైదాబాద్ మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ చేయనుంది.
also read:సైదాబాద్ హత్యాచారం: రాజు అంత్యక్రియలు పూర్తి.. వరంగల్లోనే నిర్వహించిన కుటుంబసభ్యులు
వినాయకచవితి రోజున సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై రాజు అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు.తన ఇంట్లోనే బాలిక మృతదేహం మూటగట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుండి నిందితుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు.
రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు వెయ్యి మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 16వ తేదీన స్టేషన్ ఘన్పూర్ కి సమీపంలోని రాజారాం బ్రిడ్జి వద్ద రాజు కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ పౌరహక్కుల సంఘం నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేయాలని పిటిషనర్ లక్ష్మణ్ కోరారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.