Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి వచ్చిన లారీ బొలేరోను ఢీకొట్టింది. బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురితో పాటు డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డాడు.

Road Aaccident near Hyderabad: six dead
Author
Hyderabad, First Published Mar 28, 2020, 7:23 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదు శివారులోని శంషాబాద్ సమీపంలో గల పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

బొలేరో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నారు. వీరంతా కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన కూలీలు.

లాక్ డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో తమ స్వస్థలం రాయచూర్ వెళ్లేందుకు వారు వెళ్తున్నారు. సూర్యాపేట నుంచి వస్తున్న వారి బొలేరో వాహనాన్ని వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడు.

ప్రమాదంలో బొలేరో డ్రైవర్ కూడా మరణించాడు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతుల్లో ఓ చిన్నారి, ఓ బాలిక ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్ కు చెందిందిగా గుర్తించారు. ఇందులో కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడికాయలు తీసుకుని వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios