మేడ్చల్ డ్రగ్స్ కేసు: ప్రధాన నిందితుడు ఎస్కె రెడ్డి లొంగుబాటు
మేడ్చల్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ రెడ్డి అలియాస్ ఎస్కె రెడ్డి ఎల్బీ నగర్ కోర్టులో లొంగిపోయాడు. గత నెలలో మేడ్చల్ లో 4.92 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: మేడ్చల్ డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ రెడ్డి అలియాస్ ఎస్కే రెడ్డి బుధవారం నాడు కోర్టులో లొంగిపోయాడు. మేడ్చల్లో రెండు కోట్ల విలువైన 4.92 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్కే రెడ్డి ప్రధాన నిందితుడు. గత నెల నుండి ఆయన పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మరో నిందితుడు హనుమంత రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. హనుమంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎస్కె రెడ్డి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఎస్కె రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు.
రాష్ట్రం drugs రహిత రాష్ట్రంగా ఉండాలని తెలంగాణ సీఎం Kcr అధికారులను ఆదేశించారు. గత మాసంలో సీఎం కేసీఆర్ Excise, పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గంజాయి రవాణాతో పాటు డ్రగ్స్ సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన రెండు రోజుల తర్వాతే మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకొన్నారు.సుకేష్ రెడ్డికి కెమిస్ట్రీలో మంచి పట్టుంది. దీంతో ముడి సరుకులను సేకరించి మెఫిడ్రిన్, ఆల్పాజోలం తయారు చేస్తున్నారు. పటాన్ చెరు, ఇస్నాపూర్ ప్రాంతంలో మాదక ద్రవ్యాలను తయారు చేసినట్టుగా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న హన్మంత్రెడ్డి, రామకృష్ణ గౌడ్ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఈనెల 5న మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. నిందితుల ఇళ్లతోపాటు మరో ఐదుగురి ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బావాజీపల్లి, నాగర్ కర్నూల్, చింతల్లో సోదాలు చేసినట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజిపల్లికి చెందిన హనుమంతరెడ్డి మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్ కె రెడ్డి సహయంతో బెంగళూర్, గోవా, ముంబయి నుంచి మెఫిడ్రిన్ను తీసుకొచ్చి.. నగరంలో పలువురికి హన్మంత్ రెడ్డి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణతో పాటు డ్రగ్స్ రవాణాపై నిఘా పెట్టేందుకు గాను డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని కూడా గత మాసంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. నోడల్ అధికారిగా డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఆరుగురికి డీజీపీ స్థాయి ఉండగా ఎం.మహేందర్రెడ్డి పోలీసు బాస్గా వ్యవహరిస్తున్నారు. సంతోష్ మెహ్రా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాజీవ్రతన్కు ఎస్పీఎఫ్, ప్రింటింగ్, స్టేషనరీ, గోవింద్సింగ్కు ఏసీబీ బాధ్యతల్ని అప్పగించారు. రవిగుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంజనీకుమార్ సుదీర్ఘకాలంగా నగర పోలీస్ కమిషనర్గా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి అప్పగిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
గంజాయి సరఫరా చేస్తున్న వారిపై తెలంగాణ పోలీసులు నిఘాను పెట్టారు. గంజాయితో పాటు, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నారు. గత మాసంలోనే గంజాయి సరఫరా చేస్తున్న వారిని పట్టుకొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు విశాఖ జిల్లాకు వెళ్లారు. గంజాయి సరఫరాదారులు ఎదురు తిరగడంతో పోలీసులు కాల్పులు జరిపారు.ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే.