Asianet News TeluguAsianet News Telugu

23 మంది నిందితులు.. పరారీలో 10 మంది : హైదరాబాద్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన  డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో 10 మంది పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు

hyderabad drugs case remand report
Author
Hyderabad, First Published Jan 21, 2022, 5:36 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన  డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో 10 మంది పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీతో పాటు ముఠా సభ్యులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పరారీలో వున్న 10 మంది కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్, షాహిద్ ఆలం, అఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అశోక్ జైన్‌లు పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో వున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

మత్తు మందుకు బిగ్‌షాట్స్, పెద్ద పెద్ద వ్యాపారులు కస్టమర్లుగా వున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు బిజినెస్‌మెన్‌లు. ముంబై డ్రగ్ మాఫియాకు చెందిన టోనీతో డ్రగ్స్ తెప్పించుకున్నారు వ్యాపారవేత్తలు. ఈ కేసులో పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఏ1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వత్ జైన్, కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, ప్రముఖ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి వెంకట్ చలసాని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

అంతకుముందు hyderabad సీపీ సీవీ Anand గురువారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.వ్యాపారవేత్తలు నిరంజన్ కుమార్ జైన్, శాషవత్ జైన్, యోగనాంద్ అగర్వాల్, దండు సూర్యసుమంత్ రెడ్డి, బండి భార్గవ్,వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్,  సుబ్బారావులను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.  హైద్రాబాద్ నగరంలో డ్రగ్స్ తీసుకొన్న వారి చిట్టా తమ వద్ద ఉందని సీపీ ఆనంద్ చెప్పారు. డ్రగ్స్ తో తీసుకొంటే ఇక జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. మరో నలుగురు వ్యాపారుల పేర్లను కూడా త్వరలోనే వెల్లడిస్తామని సీపీ చెప్పారు. 

పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న Drugs సరఫరా చేసే నైజీరియన్ టోనిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. దేశంలోని ముఖ్య పట్టణాలకు tony డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు. బెంగుళూరు, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ లు ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. తాత్కాలికమైన వీసా, పాస్‌పోర్టు తో టోని ఇండియాకు వచ్చి డ్రగ్స్ దందా నడుపుతున్నాడని సీవీ ఆనంద్ చెప్పారు. టోనీ వీసా, పాస్‌పోర్ట్ గడువు తీరిన తర్వాత కూడా రహస్యంగా ముంబైలో తలదాచుకొంటున్నట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ గుర్తు చేశారు.  ఇమ్రాన్  అరెస్ట్ చేసిన విషయం తెలియగానే టోని తన వాట్సాప్ చాటింగ్ ను డిలీట్ చేశారని సీవీ ఆనంద్ చెప్పారు. 2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చారన్నారు. ముంబైలోని ఈస్ట్ అంథేరిలో నివసిస్తున్నాడని ఆనంద్ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios