గజ్వేల్ లో భారీ అగ్నిప్రమాదం... రూ.50కోట్ల ఆస్తి నష్టం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.50కోట్ల ఆస్తి అగ్గికి ఆహుతి అయినట్లు సమాచారం.
గజ్వేల్: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాన్స్ ఫార్మర్లతో ఇతర సామాగ్రి కాలిబూడిదయ్యింది. మంటలను గుర్తించిన స్థానికులు విద్యుత్, ఫైర్ సిబ్బందికి సమాచార ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.50కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి వుంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.