కల్వకుర్తిలో వివాహితపై గ్యాంగ్ రేప్
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ నలుగురు కామాంధులు ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని నిర్మానుష్య ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో ఈ దారుణం జరిగింది. వివాహితను ఒంటరిగా గుర్తించిన నలుగురు యువకులు బలవంతంగా ఆమెను ఇక్కడికి తీసుకువచ్చారు. అక్కడ జనసంచారమేమీ లేకపోవడంతో నలుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్నడ్డారు.
అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అప్పుడే తన మొబైల్ నుండి 100కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ , కలెక్టర్ శ్రీధర్ లు స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన శిక్ష పడేలాగా చూస్తామని ఆయన తెలియజేశారు.