గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: కీలక విషయాలు సేకరించిన పోలీసులు
గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
చికిత్స కోసం వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. కేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అనుమానితులు ఉమా మహేశ్వర్, తో పాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు అత్యాచార ఘటనపై బీజేపీ మహిళా మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Also Read:గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: రాజారావుతో సునీత లక్ష్మారెడ్డి భేటీ
అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆరా తీస్తున్నారు. మంగళవారం నాడు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ రాజారావుతో మహిళా కమిషన్ ఛైర్మెన్ సునీత లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. ఆసుపత్రిలోని చీకటి రూమ్ ఎక్కడ ఉందనే విషయమై కూడ సూపరింటెండ్ తో కలిసి ఆమె పరిశీలించారు.