టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కొరియర్లో డ్రగ్స్ దిగుమతి, బిట్ కాయిన్ రూపంలో చెల్లింపు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోలు కోసం చేసిన ఆర్ధిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలోనే డబ్బులు చెల్లించారని అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు కోసం చేసిన ఆర్ధిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఈ మేరకు వారికి నోటీసులు పంపారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన్ కెల్విన్ కు అంతర్థాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్టుగా ఈడీ గుర్తించింది.విదేశాల నుండి ఎల్ఎస్టీ, కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ దిగుమతి చేసుకొన్నట్టుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక్క గ్రాము కొకైన్ విలువ సుమారు రూ. 10 వేలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అమెరికా నుండి మత్తు మందులు దిగుమతి చేసుకొన్నట్టుగా దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్టుగా అధికారులు చెబుతున్నారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చి ఇంటర్నెట్ ద్వారా డబ్బులు చెల్లించారని అధికారులు గుర్తించారు. కొరియర్ లో అమెరికా, అస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుండి డ్రగ్స్ దిగుమతి చేసుకొన్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పాటు పోస్టల్ శాఖ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా దర్యాప్తు అధికారులు తేల్చారు. డ్రగ్స్ కొనుగోలు కోసం డబ్బులను బిట్ కాయిన్ రూపంలోనే చెల్లించారు.డ్రగ్స్ సరఫరా, వినియోగం వరకే పరిమితమైంది ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ కొనుగోలుకు విదేశాల నుండి డబ్బు మళ్లింపు, చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తోంది.