శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత: జాంబియా యువతి అరెస్ట్
హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. జాంబియాకు చెందిన యువతి నుండి 3.2 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ. 21 కోట్లుగా అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. జాంబియాకు చెందిన ఓ మహిళ నుండి 3.2 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ సుమారు రూ. 21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.జాంబియాకు చెందిన యువతి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొంది. ఆమె హైద్రాబాద్ నుండి అస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. నేరుగా అస్ట్రేలియా వెళ్లకుండా హైద్రాబాద్ మీదుగా అస్ట్రేలియా వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె లగేజీని చెక్ చేసిన సమయంలో తెల్లటి పౌడర్ ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ తెల్లటి పౌడర్ ను పరీక్షిస్తే హెరాయిన్ గా తేల్చారు. హైద్రాబాద్ గుండా ఆమె అస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ డ్రగ్స్ తరలిస్తున్న యువతిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.