దిశ కేసు: ఎన్హెచ్ఆర్సీకి సైబరాబాద్ పోలీసుల నివేదిక
దిశ గ్యాంగ్ రేప్, హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు నివేదికను సమర్పించారు.
హైదరాబాద్: దిశపై గ్యాంగ్రేప్కు పాల్పడి దహనం చేశారని సైబరాబాద్ పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘానికి మంగళవారం నాడు నివేదికను అందించారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకొంది.ఈ కేసుపై జాతీయ మానవ హక్కుల సంఘం మూడు రోజులుగా విచారణ చేస్తోంది.
మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు దిశపై అత్యాచారం, హత్యకు సంబంధించిన విషయమై పోలీసులు తాము సేకరించిన సమాచారాన్ని అందించారు.
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొన్ని శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు. నిందితుల రక్త నమూనాలు, డిఎన్ఏ రిపోర్టులు, లారీలో దొరికిన రక్త నమూనాలతో పాటు ఇతర శాస్త్రీయ ఆధారాలను పోలీసులు సేకరించారు.
Also read:దిశ నిందితుల ఎన్కౌంటర్: పోలీసులకు చుక్కలేనా?
నిందితులు పెట్రోలు కొనుగోలు చేయడం,లారీలో దిశను తీసుకెళ్లిన దృశ్యాలను పోలీసులు జాతీయ మానవహక్కుల సంఘం ప్రతినిధులకు అందించారు. గత నెల 27వ తేదీ రాత్రి శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సర్వీస్ రోడ్డు వద్ద నిందితులు దిశపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆమెను లారీలో చటాన్పల్లి అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆమె శరీరంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి సేకరించిన పూర్తి వివరాలను ఆధారాలను పోలీసులు అందించారు.