యువతిపై ఇద్దరు రేప్: కోర్టు సంచలన తీర్పు
ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
కరీంనగర్: ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష వేసింది. దాంతో పాటు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.
2013 ఏప్రిల్ 18న బెల్లంపల్లికి చెందిన యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. నిందితులు సురరాజ్ కుమార్, సమీర్ రైల్వే స్టేషన్లో ఉన్న ఓ యువతిని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
మంచిర్యాల జిల్లా రామగుండంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడంతో విచారణ జరిగి తీర్పు వచ్చింది.. దీంతో ఐదో అదనపు సెషన్స్ న్యాయమూర్తి నాగరాజు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఐదేళ్ల కిందట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి పెద్దపల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చి పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కింది. రైలు పెద్దపల్లిలో ఆగదని తెలుసుకుని రామగుండంలో దిగింది.
మరో రైలు కోసం విశ్రాంతి గదిలో నిరీక్షిస్తున్న సమయంలో రామగుండంలోని భరత్నగర్కు చెందిన మహ్మద్ సమీర్ (20) అలియాస్ అఖిల్ అక్కడికి వచ్చి ఆమెతో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. సమీపంలోని పార్కు ఉందని అక్కడ కూర్చుందామని తీసుకువెళ్లాడు.
యువతికి తెలియకుండా సమీర్ తన స్నేహితునికి ఫోన్ చేసి అక్కడికి పిలిచాడు. దీంతో అక్కడికి చేరుకున్న రాజ్కుమార్ (22) అనే యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పారిపోయారు.
యువతి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో సాక్షులను విచారించిన కరీంనగర్ జిల్లా ఐదో అదనపు సెషన్స్ న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం ఇద్దరు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.