జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసు .. మైనర్లకు షాకిచ్చిన కోర్ట్, బెయిల్ పిటిషన్ కొట్టివేత
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసులో మైనర్లకు కోర్ట్ షాకిచ్చింది. నిందితుల బెయిల్ పిటిషన్ను జువెనైల్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా...వారిలో ఒకరు మేజర్ , మిగిలిన ఐదుగురు మైనర్లే.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో (jubilee hills gang rape) నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను జువెనైల్ జస్టిస్ కోర్టు బుధవారం తిరస్కరించింది. కేసు తీవ్రత నేపథ్యంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన వాదనలతో ఏకీభవించిన జువెనైల్ జస్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.
ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా...వారిలో ఒకరు మేజర్ , మిగిలిన ఐదుగురు మైనర్లే. వీరిలో నలుగురు మైనర్లు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ జువెనైల్ జస్టిస్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జువెనైల్ జస్టిస్ బోర్డు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరారు.
ALso Read:అమ్నీషియా పబ్ రేప్ కేస్.. ఇంగ్లీష్ సినిమాలు,వెబ్ సిరీస్ లు చూసి.. అందరం అనుకునే అలా చేశాం..
అయితే నలుగురు మైనర్లు సమాజంలో పలుకుబడి కలిగిన వారి పిల్లలేనని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో వీరికి బెయిల్ ఇస్తే... బాధితులతో పాటు సాక్షులను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జువెనైల్ జస్టిస్ బోర్డు... నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ వారి పిటిషన్లను కొట్టేసింది. మరోవైపు.. ఐదో మైనర్ కూడా రేపు (గురువారం) జువెనైల్ జస్టిస్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నాడు.
కాగా.. ఈ ఏడాది మే 28వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని Amnesia Pubలో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మైనర్లు కావడంతో కోర్టు వారిని జువెనైల్ హోమ్కి తరలించింది.