బెంగుళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలోని నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చే ఛాన్స్
బెంగుళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధులకు కూడ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్: బెంగుళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధులకు కూడ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
2019లో బెంగుళూరు శివారులోని ఫాంహౌస్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో నలుగురు తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడ పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసు విషయమై ప్రాథమిక నివేదికను సిద్దం చేశారు.
ఈ విషయమై నాలుగు ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపారు.ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న సందీప్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ పార్టీలో ముగ్గురు సినీ ప్రముఖులు, 8 మంది ఈవెంట్ మేనేజర్లతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు.కలహర్ రెడ్డి, రతన్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు పంపారు. అయితే వారు ఈ నోటీసులకు స్పందించలేదు. దీంతో మరో నోటీసు పంపారు.
ఓ యువ ఎమ్మెల్యే ఇచ్చిన విందులో డ్రగ్స్ ఉపయోగించినట్టుగా గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారని సమాచారం. ప్రజా ప్రతినిదులకు కూడ నోటీసులు పంపే అవకాశం లేకపోలేదు.