గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్: మూడు రోజులైనా ఆచూకీ లేని మరో మహిళ, అనుమానితుల విచారణ
గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆచూకీ లేని మహిళతో పాటు గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అెక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనలో చిక్కుముడులు ఇంకా వీడడం లేదు. అత్యాచారానికి గురైన ఓ మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
also read:గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం: పోలీసులకు హోంమంత్రి మహమూద్ అలీ కీలక ఆదేశాలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ చికిత్స కోసం ఈ నెల 5వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు తోడుగా ఆయన భార్య, భార్య చెల్లె కూడ ఉన్నారు.ఇదే ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ బాధిత కుటుంబానికి దూరపు బంధువు.
ఈ నెల 7వ తేదీ నుండి రోగి భార్య, ఆమె చెల్లి కన్పించకుండా పోయారు. వీరిద్దరిపై ఉమామహేశ్వర్ సహా మరో ఆరుగురు అత్యాచారానికి పాల్పడినట్టుగా ఓ మహిళ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరి కూడ కన్పించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నీ రోగి భార్య ఆచూకీ కోసం - పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాంధీ ఆసుపత్రి నుండి ఆమె బోయిగూడ వైపు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. తర్వాత ఆమె ఆచూకీ సీసీటీవీల్లో కూడ లభ్యం కాలేదు.
మరోవైపు ఉమామహేశ్వర్ సహా మరో ముగ్గురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలితో పాటు అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు.