అమెరికా ఎన్నికలపై ఘాటు వ్యాఖ్య: ఫేస్ బుక్ సీఈవో ఆడియో వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు లక్ష్యంగా ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన ప్రసంగం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. డెమొక్రటిక్ పార్టీ నేత ఎలిజబెత్ వారెన్ కూడా ఆయన వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు.
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇబ్బందుల్లో పడింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన అంతర్గత ఆడియో బహిర్గతం కావడం దుమారం రేపుతోంది. ప్రధానంగా డెమొక్రటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ అధ్యక్షురాలయితే ఎన్నికైతే ప్రమాదమని, చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయనీ జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు.
తమ సంస్థను విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాన్ని తాము గట్టి ఎదుర్కొంటామంటూ సవాల్ చేస్తూ ప్రసంగించిన ఆడియో ఒకటి సంచలనంగా మారింది. ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత ముఖాముఖిలో జుకర్ బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారని 'ది వెర్జ్' తన కథనంలో పేర్కొంది.
లీక్ అయిన ఆడియో ప్రకారం జుకర్ బర్గ్ ప్రధానంగా ఆరు అంశాలపై తన ప్రసంగాన్ని చేశారు. అమెరికా ప్రభుత్వం ఫేస్బుక్ ను విచ్ఛిన్నం చేయడంతోపాటు, వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్తో పోటీపడాలనే తమ లక్ష్యాన్నిదెబ్బతీయాలని భావిస్తున్నదన్నారు. ఎలిజబెత్ వారెన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే, ఎదురు దెబ్బలు, చట్టపరమైన సమస్యలు తప్పవని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్లాన్లను తాము తొప్పికొట్టగలమనే ధీమాను వ్యక్తం చేశారు.
అంతేకాదు ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలను ఆమె లక్ష్యంగా చేసుకున్నారని జుకర్ బర్గ్ ఆరోపణలకు దిగారు. యువతలో భారీ క్రేజ్ సంపాదించుకుని శరవేగంగా దూసుకుపోతున్న చైనా కంపెనీ సొంతమైన టిక్ టాక్ పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్టాక్ను ఎదుర్కొనేందుకు కొత్త వీడియో షేరింగ్ యాప్ లాసోను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్టు చెప్పారు.
దీంతోపాటు ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీ లిబ్రా గురించి కూడా ప్రస్తావించారు. అంతేకాదు ట్విటర్ మొత్తం ఆదాయం కంటే సెక్యూరిటీకోసం ఫేస్బుక్ ఎక్కువ పెట్టుబడులు పెడుతోందని జుకర్ బర్గ్ చెప్పుకున్నారు.
అటు వారెన్ కూడా వరుస ట్వీట్లతో ఫేస్బుక్ పై విమర్శలు గుప్పించారు. ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలను చట్టవిరుద్ధ యాంటికాంపిటీటివ్ పద్ధతుల్లో పాల్గొనడానికి, వినియోగదారుల గోప్యతా హక్కులపై విరుచుకుపడటానికి అనుమతించే అవినీతి వ్యవస్థను, తాము అడ్డుకుంటే నిజంగా 'సక్' అవుతుందని వరుస ట్వీట్లలోమండిపడ్డారు.
సమర్థవంతమైన పోటీదారులైన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను సొంతం చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఇటీవల ఎక్కువ మార్కెట్ ఆధిపత్యాన్ని సంపాదించిందని, సోషల్ నెట్ వర్క్ ట్రాఫిక్లో 85 శాతం కంటే ఎక్కువ ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థలకు పోతోందన్నారు.
మరోవైపు వెర్జ్ కథనాన్ని జుకర్ బర్గ్ ఖండించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇది పూర్తిగా అంతర్గతమైనా ఆసక్తి ఉన్నవాళ్లు ఫిల్టర్ చేయని వెర్షన్ చెక్ చేసుకోవచ్చని ఒక లింక్ను షేర్ చేశారు. కాగా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టిసి) ఫేస్బుక్ బహిరంగ యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ఎదుర్కొంటోంది. న్యూయార్క్ లోని స్టేట్ అటార్నీ జనరల్ బృందం కూడా ఫేస్బుక్పై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.