‘రోబో’తో బ్యాంక్ సేవలు: చిట్ /బాట్స్తో షురూ.. కొలువులకు సెలవిక!!
త్వరలో దేశీయంగా బ్యాంకింగ్ సేవలను క్రుత్రిమ మేధస్సు ఆధారంగా రోబోలు అందించనున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సేవలను ప్రారంభించేశాయి. కస్టమర్లకు బ్యాంకులు చాట్ బాట్స్, వాయిస్ బాట్స్ ద్వారా సేవలందించడానికి ఆటోమేషన్ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. తద్వారా బ్యాంకుల్లో మానవవనరుల వినియోగం తగ్గిపోనున్నాయి.
న్యూఢిల్లీ: టెక్నాలజీతో బ్యాంకులు వినియోగదారులకు వేగవంతంగా సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. సిబ్బంది అవసరాన్ని తగ్గించుకుని టెక్నాలజీ సాయంతో ఆటోమేషన్ విధానంలో సేవలందించడానికి సిద్ధం అవుతున్నాయి. కస్టమర్ల ఎంక్వైరీలకు వివరాలివ్వడం, చాటింగ్ ద్వారా, వాయిస్ ద్వారా సత్వర సేవలను అందించే విధానాలను అమలు చేస్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు, యస్ బ్యాంక్ తదితర ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్ల సేవలకు చాట్బాట్స్, వాయిస్ బాట్స్ను ఉపయోగించుకుంటున్నాయి. 15 నెలల క్రితం నుంచి ఈ దిశగా అడుగులు వేయడం ఆరంభించాయి.
ప్రాంతీయ భాషల్లో ప్రాసెసింగ్కు, కృత్రిమ మేథలో ఆధునికతల నేపథ్యంలో తాము భవిష్యత్ ఆటోమేటెడ్ అంచున ఉన్నట్టు అవి పేర్కొంటున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ హెడ్ నితిత్చుగ్ ఈ సందర్భంగా‘18 నెలలుగా బాట్స్ వినియోగాన్ని ఆరంభించాం. ఇప్పటి వరకు 80 లక్షల విచారణలను పూర్తి చేశాం. సేవల విషయంలో 90 శాతం కచ్చితత్వాన్ని సాధించాం’అని తెలిపారు.
రోబో మాదిరిగా ఇంటర్నెట్ వేదికగా పనిచేసే ఓ ఆర్టిఫీషియల్ టూల్ను వినియోగంలోకి తీసుకొచ్చాయి. కేవలం బ్యాంకింగ్ సేవల సహాయకారిగానే ఉండకుండా, తమ చాట్బాట్ అప్లికేషన్ ‘ఎవ’ ద్వారా బిల్లుల చెల్లింపులు, సినిమా టికెట్ల బుకింగ్, ఇతర సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ హెడ్ నితిత్చుగ్ చెప్పారు.
ఎవ చాట్బాట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్లో కనిపిస్తుంది. ఎవ టూల్ సాయంతో బ్యాంకుల ఖాతాదారులు తమ సందేహాలు, సేవల వివరాలు పొందొచ్చు. భిన్న రూపాల్లో వచ్చే ప్రశ్నలను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై ఈ టూల్స్కు బ్యాంకర్లు ఎప్పటికప్పుడు తెలియజేయడం ద్వారానే ఎక్కువ కచ్చితత్వానికి అవకాశం ఉంటుంది.
కోటక్ మహింద్రా బ్యాంకు సైతం తన కార్యకలాపాల్లో బాట్ సేవలను ప్రోత్సహిస్తోంది. బాట్ ద్వారా ప్రతి ఖాతాదారు ప్రతిస్పందించడాన్ని మూడు నాలుగు స్టెప్లకే పరిమితం చేస్తున్నామని, ఇది కస్టమర్ సేవల నిడివిని 45–50 సెకండ్లకే పరిమితం చేసేందుకు సాయపడుతోందని కోటక్ మహీంద్రా బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు.
ఈ మేరకు బాట్ ద్వారా వినియోగదారులకు సేవలను 2018 ఫిబ్రవరిలో ప్రారంభించగా, 16 లక్షల ప్రశ్నలకు చాట్బాట్ సమాధానాలు ఇచ్చినట్టు, 91 శాతం అక్యురసీ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ చెప్పారు. ఐవీఆర్ ఆధారిత సేవల పరిష్కారం సాధారణ ప్రక్రియలో 3 శాతంగా ఉంటే, బాట్ సాయంతో తొలి దశలోనే 9 శాతానికి చేరుకున్నట్టు తెలిపారు.
రెండో దశలో ఇది ఇప్పటికే 14 శాతానికి చేరుకుందని కోటక్ మహీంద్రా బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ అన్నారు. రెండో దశలో ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి అనుకూలంగా ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు కపూర్ తెలిపారు. యస్ బ్యాంకు అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లను యస్ రోబో టూల్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
బ్యాంకుల ఆధునిక పోకడల వెనుక కారణాలను టెక్ స్టార్టప్ ‘యాక్టివ్ ఏఐ’ ఫౌండర్ రవిశంకర్ చెప్పారు. 21వ శతాబ్దిలో యుక్త వయస్సులోకి వచ్చిన మిలీనియల్స్ సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, వాట్సాప్, ఇతర వేదికల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కనుక బ్యాంకులు సైతం ఆయా ప్లాట్ఫామ్లపై అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
మెస్సేజింగ్ యాప్స్ను 30 కోట్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. కానీ, బ్యాంకులకు 2.5 కోట్ల యూజర్లే ఉన్నారు. బ్యాంకులు సంభాషణల ఆధారిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లతో కస్టమర్లకు చేరువ కావాలి. బ్యాంకు అప్లికేషన్లోనే గూగుల్ సెర్చ్ మాదిరిగా సెర్చ్ బార్ ఉండాలి. అక్కడ కస్టమర్కు అందుబాటులో ఉన్న అన్ని సేవల వివరాలు ఉంచాలని యాక్టివ్ ఏఐ ఫౌండర్ రవిశంకర్ చెప్పారు.
బ్యాంకింగ్తో సంభాషణలన్నీ టెక్స్ట్, ఎమోజిలు, గెస్చర్స్తోనే జరగాలి. ఆర్థిక సేవలకు భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ తరమేనని యాక్టివ్ ఏఐ ఫౌండర్ రవిశంకర్ పేర్కొన్నారు. ఈ తరహా సేవల వల్ల బ్యాంకులకు ఖర్చులు బాగా తగ్గుతాయని, కస్టమర్లకు సేవలు వేగంగా అందుతాయని తెలిపారు.