వాటర్ ట్రాప్ నాచ్తోపాటు విపణిలోకి ఎంఐ A3
ఆండ్రాయిడ్ వన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన షియోమీ ఫోన్ తాజాగా అదే సిరీస్ లో ఏ3 ఆండ్రాయిడ్ ఫోన్ భారత విపణలో అడుగు పెట్టనున్నది.
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరకే అన్ని రకాల ఫీచర్లూ అందుబాటులోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీ మరో స్మార్ట్ఫోన్ను భారత విపణిలోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్వేర్తో గతంలో తీసుకొచ్చిన ఎంఐ ఏ1, ఏ2 ఫోన్లకు కొనసాగింపుగా.. ఏ3 ఫోన్ను విడుదల చేసింది. ట్రిపుల్ కెమెరాలతో, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్తో వస్తోంది. ఈ ఫోన్ ధర ఎంతో.. ఇందులో లభించే స్పెషికేషన్లు ఏమిటో తెలుసుకుందాం..
ఎంఐ ఏ3 మొత్తం రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. వీటిలో 4జీబీ విత్ 64జీబీ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించగా.. 6జీబీ విత్128జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా కంపెనీ పేర్కొంది.
‘నాట్ జస్ట్ బ్లూ’, ‘మోర్ దేన్ వైట్’, ‘కైండ్ ఆఫ్ గ్రే’ రంగుల్లో ఎంఐ ఏ3 ఫోన్ లభించనుంది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ వెబ్సైట్లలో శుక్రవారం నుంచి దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో ఆఫ్లైన్లోనూ లభ్యం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలుపై రూ.750 క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు. రూ.249 రీఛార్జిపై డబుల్ డేటాను ఎయిర్టెల్ అందిస్తోంది.
ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్వేర్తో వస్తున్న ఎంఐ ఏ3 ఫోన్లో బ్యాక్ ట్రిపుల్ కెమెరాలను అమర్చారు. బ్యాకప్ 48+8+2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కూడా షియోమీ అందిస్తోంది.
వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్తో వస్తున్న ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఆండ్రాయిడ్ 9 ‘పై’ ఓఎస్తో. 6.08 అంగుళాల హెచ్డీ+ సూపర్ ఆమోలెడ్ స్ర్కీన్ ఇందులో ఉన్నాయి.
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తున్నారు. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అమర్చిన ఈ ఫోన్లో చేర్చిన 4,030 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ.. 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టివ్గా ఉంటుంది.