ఆన్లైన్ లో దూసుకుపోతున్న షియోమీ, జియో సేల్స్
స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2018లో 14.5 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల సేల్స్లో చైనా మేజర్ షియోమీ మొదటి స్థానంలో ఉంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ రికార్డు స్థాయిలో సేల్స్లో టాపర్గా నిలిచింది.
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ఫోన్ విపణి 2018లో 14.5 శాతం వృద్ధి చెందిందని, దాదాపు 14.23 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. కాగా, స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చైనా మేజర్ షియోమీ.. ఫీచర్ ఫోన్ల సేల్స్లో రిలయన్స్ జియో టాప్ వన్ సంస్థలుగా నిలిచాయి.
అక్టోబర్-డిసెంబర్ మధ్య 2018లో పూర్తిగా స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో శామ్ సంగ్, వివోలతోపాటు షియోమీ సత్తా చాటింది. 28.9 శాతం వాటాను సొంతం చేసుకుని షియోమీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక దక్షిణ కొరియా మేజర్ శామ్సంగ్ డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 18.7% ఫోన్ల విక్రయాలను పెంచుకోగా, మొత్తం ఏడాదిలో 22.4 శాతం వాటా మొబైల్ ఫోన్ల విక్రయం వ్రుద్ధి సాధించి రెండో స్థానంతో సరిపెట్టుకున్నది.
చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ వివో మూడో త్రైమాసికం ముగిసేనాటికి 9.7%, పూర్తి సంవత్సరానికి 10% మేర మార్కెట్ వాటాను పొంది మూడో స్థానంలో నిలిచింది.
ఫీచర్ ఫోన్ మార్కెట్లో మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్లో 56 శాతం వ్రుద్ధి పొందింది.
మొత్తం ఫీచర్ ఫోన్ విపణిలో రిలయన్స్ జియో ఫోన్లే 36.1 శాతం వాటా కలిగి ఉండడం గమనార్హం. గతేడాది మొబైల్ ఫోన్ల సేల్స్లో 18.13 కోట్ల విక్రయాలు నమోదు అయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 10.6 శాతం వృద్ధిని పొందింది. 2017లో స్మార్ట్ఫోన్ విక్రయాలు 12.43 కోట్లుగా ఉన్నాయి.
2017తో పోలిస్తే గతేడాది దీపావళి పండుగ సీజన్లోనే డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 19.5% వృద్ది చెంది 3.03 కోట్ల నుంచి 3.63 కోట్లకు చేరాయి. అయితే జూలై-సెప్టెంబర్ మధ్య కాలంతో పోలిస్తే పోలిస్తే మాత్రం 15.1 శాతం తగ్గాయి.
2018లో ఆన్లైన్ హవా కొనసాగిందని.. పలు మార్లు ఈ- రిటైల్ సంస్థలు అందించిన డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్, బైబ్యాక్ పథకాలు ప్రకటించడం వల్ల డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 42.2% స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం ఏడాదిలో 38.4 శాతం మేర వాటా సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ (క్లయింట్ డివైజెస్) ఉపాసన జోషి పేర్కొన్నారు.
ఈ- కామర్స్ సంస్థలు ప్రాథమికంగా కల్పించిన డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, బై బ్యాక్ స్కీమ్లు విక్రయాల పెరుగుదలకు కారణమని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ముగిసేనాటికి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 42.2 శాతం పెరుగుతాయని ఆమె అంచనా వేశారు.
అయితే ఈ- వ్యాపార విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తేవడంతో ఈ-కామర్స్ భాగస్వాములు ఇప్పటికే ఆఫ్లైన్లోకి వస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడమూ ఇందుకు కారణం. అయితే ఇప్పటికి ఆఫ్ లైన్ మార్కెట్ భారతదేశంలో మొబైల్ ఫోన్ల కొనుగోలుకు పెద్ద అసెట్గా ఉంది. ఆఫ్ లైన్ సేల్స్ మోస్తరుగా 6.7 శాతం పెరిగితే, నాలుగో త్రైమాసికంలో 5 శాతం పెరుగుతుందని ఐడీసీ అంచనా.
ప్రీమియం ఫోన్ల విక్రయాల్లో వార్షిక ప్రాతిపదికన 43.9 శాతం పెరుగుదల నమోదైంది. చైనా ఫోన్ వన్ ప్లస్ సంస్థ 500-700 డాలర్ల విభాగంలో 56 శాతం విక్రయాలతో లీడర్గా అవతరించింది. మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో 181.3 మిలియన్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2017తో పోలిస్తే 10.6 శాతం అధికం.