మేకిన్ ఇండియా: వోకల్ ఈజ్ లోకల్
చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 'వోకల్ ఫర్ లోకల్' నినాదానికి మద్దతు పెరుగుతోంది.
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'బాయ్కాట్ చైనా' ఉద్యమం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 'వోకల్ ఫర్ లోకల్' నినాదానికి మద్దతు పెరుగుతోంది.
వీటిని దేశీయ కంపెనీలు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయం అని చాలా మంది భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని తిరిగి సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నిస్తోంది. ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మైక్రోమ్యాక్స్ ఇచ్చిన సమాధానాలతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది.
‘చైనా ఫోన్లకు ప్రత్యామ్నాయంగా కొత్త మోడళ్లను తీసుకురండి. మీకు ఆ సామర్థ్యం ఉంది. మీరు చేయగలరు. అందుకు ఇదే సరైన సమయం. భారతీయులమంతా మీతో ఉంటూ.. మీకు పూర్తి మద్దతు ఇస్తాం’ అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.
దీనిపై మైక్రోమ్యాక్స్ స్పందిస్తూ 'వోకల్ ఫర్ లోకల్'కు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అంతర్గతంగా కొత్త ఉత్పత్తుల కోసం మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. త్వరలోనే సరికొత్త ఉత్పత్తులతో మీ ముందుకు వస్తాం’ అని ట్వీట్ చేసింది.
‘మైక్రోమ్యాక్స్ మీ నుంచి ఏదైనా మిడ్రేంజ్ ఫోన్ను అశించవచ్చా?’ అని మరో అభిమాని ట్విట్ చేశాడు. దానికి 'ప్రీమియం ఫీచర్లు, మాడ్రన్ లుక్, బడ్జెట్ ధరలో కొత్త మోడల్ త్వరలోనే తీసుకురానున్నట్లు' మైక్రోమ్యాక్స్ సమాధానమిచ్చింది.
కొత్త ఉత్పత్తులతో రానున్నామని చెప్పిన మైక్రోమ్యాక్స్.. వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మైక్రోమ్యాక్స్ ట్వీట్లతోపాటు పలు టెక్ వార్తా సంస్థలు సేకరించిన సమచారం ప్రకారం.. త్వరలోనే ఈ కంపెనీ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి.
చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ మోడళ్లను తీసుకురానుంది. ఈ మూడు ఫోన్ల ధరలు రూ.10,000 కన్నా తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోదారులను ఆకర్షించేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నాలు చేయొచ్చు.
మార్కెట్లో ఇప్పుడు పలు సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐదు స్మార్ట్ఫోన్ బ్రాండ్లు దేశంలో 75% మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇదే మైక్రోమ్యాక్స్కు ప్రధాన అడ్డంకిగా మారొచ్చని నిపుణులు అంటున్నారు.