కరోనా ఎఫెక్ట్: ఐబీఎంలో 5000 మందిపై వేటు.. లెన్స్కార్ట్లో కూడా
కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల్లో కోత విధించాలని నిర్ణియించింది. ప్రత్యేకమైన, క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది.
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల్లో కోత విధించాలని నిర్ణియించింది. ప్రత్యేకమైన, క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తొలగింపులను కంపెనీ ధృవీకరించింది.
ఈ నిర్ణయం తమ ఉద్యోగులలో సృష్టించే కష్టమైన పరిస్థితిని గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబీఎం సబ్సిడీ వైద్య కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనాతో విధించిన లాక్ డౌన్ వల్ల సంభవించిన నష్టాలతో భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల లీగ్లో చేరింది.
అయితే తాజా నిర్ణయంతో ఎంతమంది ప్రభావితమవుతున్నారో ఐబీఎం వెల్లడించలేదు. కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. ముఖ్యంగా మధ్య స్థాయి ఉద్యోగులపై వేటు వేయనుంది. అమెరికాలో కనీసం ఐదు రాష్ట్రాల్లో వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. వీరిలో భారతదేశంలో కొన్ని వందల ఉద్యోగులు కూడా ప్రభావితం కానున్నారు. బాధిత ఉద్యోగులకు మూడు నెలల వేతనాన్ని చెల్లించనుంది.
also read:హైదరాబాద్లో జియోమార్ట్ సేవలు.. అదిరిపోయే డిస్కౌంట్లు కూడా
ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నదీ ఐబీఎం స్పష్టం చేయకపోయినప్పటికీ ఆ సంస్థలో కనీసం 5,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నట్టు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు హ్యూలెట్ పాకార్డ్ ఎంటర్ప్రైజ్ (హెచ్పీఈ) తమ ఎగ్జిక్యూటివ్ల వేతనాల్లో 20 నుంచి 25 శాతం మేరకు కోత విధించబోతున్నట్టు తెలుస్తున్నది.
ఆన్లైన్ ఫైనాన్సింగ్ సంస్థ లెండింగ్కార్ట్ తమ కంపెనీ నుంచి 200 మంది ఉద్యోగులను (30 శాతం మందిని) తొలగించింది. లాక్డౌన్ వల్ల ఈ కంపెనీ ఇబ్బందుల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణం. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేకుండా రూ.లక్ష నుంచి రూ.40 లక్షల వరకు రుణాలను అందజేస్తున్నది.