అమెరికన్లకు గూగుల్ స్పెషల్ వెబ్ సైట్.. త్వరలో పలు దేశాలకూ..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19(కరోనా వైరస్) పై అవగాహన కల్పించేందుకు, ప్రజలకు గల సందేహాలను నివృత్తి చేసేందుకు సొంతంగా కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది.
ఈ మహమ్మారి బారిన పడకుండా, కాపాడుకునే రక్షణ చర్యలు తదితర సమాచారాన్ని అందించేందుకు వీలుగా గూగుల్ వెబ్సైట్ను శనివారం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశం నిర్వహించిన వారం తరువాత, సెర్చింజన్ గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా కరోనావైరస్ కోసం గూగుల్ ఒక స్క్రీనింగ్ వెబ్సైట్ తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను పరీక్షా సైట్లకు నిర్దేశించాలని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ‘గూగుల్.కామ్/కోవిడ్19 అనే వెబ్సైట్ను తెచ్చింది.
ఈ వైరస్పై అవగాహన, నివారణ, స్థానిక వనరులపై దృష్టి గూగుల్ కేంద్రీకరించింది. కోవిడ్ -19 సమాచారం రాష్ట్రాల ఆదారంగా భద్రత, నివారణ మార్గాలతోపాటు కోవిడ్ సంబంధ సెర్చ్, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్ తెలిపింది.
అమెరికాలో ప్రారంభించిన ఈ వెబ్సైట్ రానున్న రోజుల్లో ఇతరదేశాలు, మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తన సొంత బ్లాగ్ పోస్ట్తో వెల్లడించింది. మరిన్ని వనరులు అందుబాటులోకి వచ్చినప్పుడు వెబ్సైట్ను అప్డేట్ చేస్తామని సెర్చింజన్ గూగుల్ తెలిపింది.
also read:ఖచ్చితమైన డేటా కోసం కరోనాపై వాట్సాప్ డబ్ల్యూహెచ్ఓ ‘హెల్త్ అలర్ట్’
ఈ వెబ్ సైట్ ఎప్పటి మాదిరిగానే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నామని చెప్పింది. సెర్చ్ ఫలితాల్లో, గూగుల్ మ్యాప్స్లో నేరుగా కరోనావైరస్ గురించి నమ్మదగిన, విశ్వజనీయ సమాచారం అందేలా చర్యలు తీసుకుంటామని సెర్చ్ దిగ్గజం తెలిపింది.
కాగా కరోనా మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా శనివారం నాటికి 11,000 దాటింది. 2,35,000 మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. ఐరోపా ఖండంలో ఐదు వేల మందికి పైగా కరోనా వైరస్కు గురయ్యారు. ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది.