పేటీఎం మాల్లో ‘ఈబే` ఎంట్రీ.. ఇంటర్నేషనల్ మార్కెట్ వైపు..
- అమెరికా ఈ- రిటైల్ సంస్థ ‘ఈ-బే’.. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘పేటీఎం మాల్’లో 5.5 శాతం వాటాలను కొనుగోలు చేసింది.
- త్వరలో వివిధ దేశాల్లో బిజినెస్ ప్రారంభించడానికి ‘పేటీఎం వరల్డ్ మాల్’ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.
న్యూఢిల్లీ: అమెరికా ఈ-టెయిలర్ సంస్థ ఈబే పేటీఎం మాల్ సంస్థలో బయటకు వెల్లడించిన మొత్తం పెట్టుబడితో 5.5 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ సంస్థ భారత ఈ కామర్స్ విపణిలో పెట్టుబడులు పెట్టడం ఇది మూడో సారి. ఆసియాలో అతిపెద్ద మార్కెట్ ప్లేస్గా భారత్ అవతరించడంలో భాగంగా పేటీఎమ్ మాల్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకున్నామని ఈబే అధ్యక్షుడు, సీఈవో డెవిన్ వెనిగ్ తెలిపారు.
‘పేటీఎం మాల్లో ఈబే ఒక స్టోర్ తెరుస్తుంది. మా అంతర్జాతీయ ఇన్వెంటరీ యాక్సెస్ చేసేందుకు కోట్లమంది పేటీఎం, పేటీఎం మాల్ వినియోగదారులకు దీంతో అవకాశం లభిస్తుంది. పేటీఎం మాల్లో దాదాపు 5.5 శాతం వాటాకు సమానంగా ఈబే పెట్టుబడి పెట్టనుంది’ అని డెవిన్ తెలిపారు. ఈబే తొలుత 2014లో స్నాప్ డీల్ సంస్థలో పెట్టుబడి పెట్టింది.
ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకొనేందుకు 2017లో 61 మిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. అదే ఏడాది ఫ్లిఫ్ కార్ట్ సంస్థలో ఈక్విటీ వాటా బదిలీకి 500 మిలియన్ డాలర్ల నగదు ఇచ్చింది. భారత్ లోని తన వ్యాపారాన్ని ఫ్లిప్ కార్ట్ సంస్థకు విక్రయించింది.
అయితే 2018లో ఫ్లిప్ కార్ట్లో వాల్ మార్ట్ 16 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో తన వాటాను 1.1 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. ఇదిలా ఉంటే భారతదేశంలో తన సంస్థ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తున్నట్లు కూడా ఈ-బే ప్రకటించింది.
2018 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో పేటీఎం మాల్ రూ.1,787 కోట్ల నికర నష్టం నమోదు చేయడం గమనార్హం. పేటీఎం మాల్ సంస్థ తన ప్రత్యర్థి సంస్థలు వాల్ మార్ట్, అమెజాన్ సంస్థల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ‘పేటీఎం వరల్డ్ స్టోర్’ను ఏర్పాటు చేయడంపై ద్రుష్టిని కేంద్రీకరించింది పేటీఎం.
దీని ద్వారా భారతీయ వినియోగదారులకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తువులు కూడా అందుబాటులోకి రానున్నాయి. పేటీఎంవరల్డ్ మాల్ పేరుతో ఏర్పాటు చేస్తే అమెరికా, చైనా, స్పెయిన్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో యూనిట్లను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.