నిపుణుల మాట: ఫేస్బుక్ ఖాతాదార్లూ! టేక్ కేర్!!
ఫేస్బుక్ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్ అవుట్ చేసి మళ్లీ రీలాగిన్ అవడం మంచిదని సైబర్, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్ అవుట్ చేసి మళ్లీ రీలాగిన్ అవడం మంచిదని సైబర్, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు ఐదు కోట్ల ఖాతా యాక్సెస్ టోకెన్లను హ్యాకర్లు చోరీ చేయడంతో యూజర్లు ముందస్తు జాగ్రత్తగా తమ ఖాతాలను లాగ్ అవుట్ చేయాల్సిందిగా సూచించారు.
‘మొబైల్స్, ల్యాప్టాప్, డెస్క్టాప్ ఇలా ఎందులో అయితే ఫేస్బుక్ లాగిన్ అయి ఉన్న 2.3బిలియన్ల యూజర్లు ఇప్పుడు వాటిని లాగ్ అవుట్ చేసుకొని మళ్లీ రీలాగిన్ అవడం చాలా ముఖ్యం. యాక్సెస్ టోకెన్స్ హ్యాకింగ్ మనకు ఓ మేలు కొలుపు లాంటిది. ఇలా చేయడం వల్ల సోషల్ మీడియా ఖాతాల భద్రత, గోప్యత సెట్టింగ్స్ను సమీక్షించుకున్నట్లవుతుంది. కనుక ఫేస్బుక్ ఖాతాదారులు తమ ఖాతాలను తప్పనిసరిగా లాగ్ఔట్ అయి లాగిన్ కావాలి’ అని గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మేజర్ సొఫోస్ నిపుణుడు చెస్టర్ విస్నివాస్కి హెచ్చరించారు. భారతదేశంలో 27 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారులు ఉన్నారు. వారి డేటా కూడా తస్కరణకు గురవుతుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సాఫ్ట్వేర్ ఇంటిగ్రిటి గ్రూప్ అనుబంధ సంస్థ సెక్యూరిటీ టెక్నాలజీ ‘సినోప్సిస్’ ఉపాధ్యక్షుడు డాక్టర్ గ్యారీ మైక్ గ్రా మాట్లాడుతూ ‘ఫేస్బుక్ ఖాతాల హ్యాకింగ్ స్థాయి ఎంత వరకు ఉన్నది, అందులో ఏ మేరకు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఫేస్ బుక్ యాజమాన్యం ఇమిడ్చిన ‘వ్యూ యాజ్’ హ్యాకర్ల దోపిడీకి అవకాశం కల్పించింది. దీంతో ఈ ఫీచర్ రూపకల్పనలో రూపకల్పనలోనే సమస్య ఉన్నదని తేలింది. ఇందులో అభ్యంతరకరమైన భద్రతా దుర్బలత్వం ఉండటం వల్లే సమస్య తలెత్తింది’ అని చెప్పారు.
ఫేస్బుక్ ఖాతాదారుల డేటాను తస్కరించిన హ్యాకర్లు సదరు సర్వర్లను బేసిగ్గా ఫూల్స్ను చేసేశారని ఐటీ రిస్క్ అసెస్మెంట్ అండ్ డిజిటల్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడర్, సీఈఓ అండ్ లూడిడౌస్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ మోదీ తెలిపారు. హ్యాకర్లను ఫేస్ బుక్ సర్వర్లు ధ్రువీక్రుత వినియోగదారులేనని భావించి ఉండవచ్చునని, అందుకే పూర్తిగా తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు వీలు చిక్కిందన్నారు. కనుక మీరు మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ను రీ స్టార్ట్ చేయడం ద్వారానూ ఐపీ లో మార్పులు తేవడం ద్వారా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫేస్బుక్ వెబ్సైట్ భద్రత వ్యవస్థలోని ఓ లోపాన్ని వినియోగించుకుని దాదాపు 5కోట్ల ఖాతాల యాక్సెస్ టోకెన్స్ను హ్యాకర్లు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ యాక్సెస్ టోకెన్ ద్వారా హ్యాకర్లు ఖాతాదారుల సమాచారాన్ని చూడొచ్చు. మంగళవారం ఈ లోపాన్ని గుర్తించామని, గురువారం రాత్రికి సరిచేశామని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఇది తీవ్రమైన సమస్యేనని ఆయన పేర్కొన్నారు. అయితే.. హ్యాకింగ్కు ఎవరు పాల్పడ్డారనేది మాత్రం తెలియడం లేదని ఫేస్బుక్ వెల్లడించింది. ఇతరులకు మన ఖాతాలో ఎలా కనిపిస్తుందన్నది తెలుసుకునేందుకు వీలు కల్పించే వ్యూ ఆజ్ ఫీచర్లో ఈ లోపం ఉందని దీన్ని తాత్కాలికంగా నిలిపవేశామని చెప్పారు.