విరాట్ లేకపోయినా.. రోహిత్.. పాక్ మాజీ కెప్టెన్ కామెంట్
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం సంచలన కామెంట్స్ చేశారు.
ఆసియా కప్ లో తనదైన శైలిలో జట్టును విజయదిశగా నడిపిస్తున్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం సంచలన కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీలేకపోయినా..రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకువెళుతున్నాడన్నారు. పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతకంతో చెలరేగడం తనను ఆకట్టుకుందని వసీం అన్నారు.
‘రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సులభంగా పరుగులు రాబడుతున్నాడు. ధావన్ కూడా అతనితో సమానంగా రాణిస్తున్నాడు. వీరిద్దరూ క్రీజులోకి వచ్చారంటే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు.’ అని వసీం అక్రమ్ ఒక మీడియా సంస్థతో తెలిపారు. కేవలం వసీం మాత్రమే కాదు.. రోహిత్ కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.