IPL 2020: విరాట్ ముందుండి జట్టును నడిపిస్తాడు... - ఏబీ డివిల్లియర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తోడబుట్టకపోయినా కోహ్లీ తనకు సోదరుడితో సమానమని చాలాసార్లు విరాట్ గురించి చెప్పుకొచ్చాడు డివిల్లియర్స్. 2011 నుంచి బెంగళూరు జట్టుతో కొనసాగుతున్న డివిల్లియర్స్, కోహ్లీ లేని మ్యాచులకు కెప్టెన్సీ కూడా చేశాడు. ఐపీఎల్ కెరీర్లో 4,395 పరుగులు చేసిన డివిల్లియర్స్ ఖాతాలో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ గురించి చెప్పాడీ ‘మిస్టర్ 360’. ‘మేమంతా బాగా కష్టపడుతున్నాం. ఈసారి మంచి ప్రదర్శన ఇవ్వాలని బాగా శ్రమిస్తున్నాం. దీనంతటికి కారణం విరాట్ కోహ్లీయే. అన్నింట్లో ముందు ఉంటూ జట్టును నడిపిస్తున్నాడు కోహ్లీ. నాయకుడే ముందుండి నడిపిస్తుంటే, అతని బాటలో నడవడం జట్టుకు చాలా ఈజీ’ అన్నాడు ఏబీ డివిల్లియర్స్.
ఆసీస్ ప్లేయర్లు ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపాలను కొనుగోలు చేసిన బెంగళూరు, ఈసారి కచ్ఛితంగా టైటిల్ గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. మూడు సార్లు ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయిన బెంగళూరు బెంగ ఈసారి అయినా తీరుతుందో లేదో చూడాలి.