హ్యాట్రిక్ గర్ల్ వందనా కటారియాకు ఉత్తరాఖండ్ భారీ నజరానా...
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల హాకీలో భారత అత్యుత్తమ ప్రదర్శన లో వందన కటారియా పోషించిన అద్భుతమైన పాత్ర తమకు గర్వకారణమని సీఎం ఆమెను ప్రశంసించారు. మరోవైపు టోక్యో ఒలంపిక్స్ లో సెమీ ఫైనల్లో ఓటమికి వందన కటారియానే కారణమంటూ.. కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
డెహ్రాడూన్ : హాకీ క్రీడాకారిణి, హ్యాట్రిక్ గర్ల్ వందన కటారియాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనకు గాను ఆమెకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. అలాగే ఆటలలో ప్రతిభను పెంపొందించేందుకు త్వరలోనే ఒక ఆకర్షణీయమైన కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నామని కూడా ఆయన తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల హాకీలో భారత అత్యుత్తమ ప్రదర్శన లో వందన కటారియా పోషించిన అద్భుతమైన పాత్ర తమకు గర్వకారణమని సీఎం ఆమెను ప్రశంసించారు. మరోవైపు టోక్యో ఒలంపిక్స్ లో సెమీ ఫైనల్లో ఓటమికి వందన కటారియానే కారణమంటూ.. కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో ఒకరు నేషనల్ హాకీ ప్లేయర్ అని సమాచారం. అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనా పై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో వందన కటారియా వల్లనే ఓడిపోయిందని దారుణమైన ట్రోలింగ్కు పాల్పడ్డారు. కొందరు ఆమె నివాసం వద్ద నిరసనకు దిగారు. దీనిపై వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని రోష్నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందన కటారియా. టోక్యో ఒలంపిక్స్ లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టి సరికొత్త రికార్డు సాధించింది. భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో నాలుగు, మూడు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం నాటి హోరా హోరీ కాంస్య ప్లే-ఆఫ్ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమి పాలైంది. ముఖ్యంగా చివరి క్వార్టర్లో ఫలితం తారుమారు కావడంతో తొలి ఒలింపిక్ పథకాన్ని సాధించాలనే భారత మహిళల హాకీ జట్టు ఆశ ఫలించ కుండా పోయింది.