మురళీ విజయ్ కామెంట్స్ పై స్పందించిన సెలక్టర్స్
సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్ మురళీ విజయ్ చేసిన కామెంట్ పై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.
టెస్టు సిరీస్లో తనను జట్టు నుంచి తప్పించే క్రమంలో కనీసం సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్ మురళీ విజయ్ చేసిన కామెంట్ పై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టులకి పృథ్వీ షాని ఎంపిక చేశారు. అయితే.. జట్టు నుంచి తనని తప్పించే ముందు సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మురళీ విజయ్ నిన్న ఆవేదన వ్యక్తం చేశాడు. అతనితో పాటు ఇటీవల కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్ కూడా సెలక్టర్ల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే.
మురళీ విజయ్ వ్యాఖ్యలపై తాజాగా భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ‘జట్టు నుంచి మురళీ విజయ్ని తప్పించేటప్పుడు అతనికి సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం. జట్టు ఎంపిక సమయంలో నా సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ ఓపెనర్ మురళీ విజయ్తో మాట్లాడాడు. అతడ్ని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో కారణం కూడా సవివరంగా చెప్పాడు. కానీ.. మురళీ విజయ్ తనకి సమాచారం ఇవ్వలేదని నిన్న చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేసిన మురళీ విజయ్ను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఆపై నాలుగు, ఐదు టెస్టుల్లో సైతం అతనికి చోటు దక్కలేదు. కాగా, దీనిపై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధ కల్గించిందని విజయ్ తాజాగా పేర్కొన్నాడు.
read more news
కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన