Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ ఓపెన్‌ 2022: కిడాంబి శ్రీకాంత్‌కి షాకిచ్చిన మిథున్ మంజునాథ్... ప్రీక్వార్టర్స్‌లోకి ప్రణయ్...

Singapore Open 2022: వరల్డ్ నెం.4ను ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లిన ప్రణయ్... మిథున్ మంజునాథ్ చేతిలో కిడాంబి శ్రీకాంత్‌కి ఊహించని షాక్...

 

Singapore Open 2022: Kidambi Srikanth losses against Mithun Manjunath, Prannoy enters into Pre-quarters
Author
India, First Published Jul 14, 2022, 2:11 PM IST

భారత బ్యాడ్మింటన్ టాప్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కి, సింగపూర్ ఓపెన్ 2022 ఆరంభ రౌండ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ మిథున్ మంజునాథ్‌తో తలబడి 2-1 తేడాతో పోరాడి ఓడాడు...

తొలి సెట్‌ను 21-17 తేడాతో సొంతం చేసుకున్న మిథున్ మంజునాథ్, రెండో సెట్‌ను 15-21 తేడాతో చేజార్చుకున్నాడు. తొలి సెట్‌లో ఓడినా, రెండో సెట్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన కిడాంబి శ్రీకాంత్, మూడో సెట్‌లో తన ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయాడు...

మూడో సెట్‌లో మిథున్ మంజునాథ్ దూకుడును తట్టుకోలేకపోయిన కిడాంబి శ్రీకాంత్ 21-18 తేడాతో సెట్‌ని, మ్యాచ్‌ని కోల్పోయాడు...  మరో మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్, థాయ్‌లాండ్‌కి చెందిన సితికోమ్ తమాసిన్‌పై రెండు సెట్లలో సునాయస విజయా అందుకుని, రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు...

తొలి రౌండ్‌లో 21-13, 21-16 తేడాతో సితికోమ్ తమాసిన్‌ని ఓడించిన ప్రణయ్.. రెండో రౌండ్‌లో తైవాన్‌కి చెందిన చో టెన్ చెన్‌ని ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. వరల్డ్ నెం.4 ర్యాంకర్ చో టెన్ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 14-21, 22-20, 21-18 తేడాతో విజయం సాధించాడు ప్రణయ్.. 


భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నీలో రెండో రౌండ్ గండాన్ని దాటేసింది. వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది పీవీ సింధు...

వియత్నాంకి చెందిన తుయ్ లిన్ గుయెన్‌, మొదటి రౌండ్‌లో పీవీ సింధుపై మంచి ఆధిపత్యం కనబర్చింది. 19-21 తేడాతో మొదటి సెట్ కోల్పోయిన పీవీ సింధు, ఆ తర్వాత అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 21-19 తేడాతో రెండో సెట్ గెలిచిన తెలుగు తేజం, 21-18 తేడాతో మూడో సెట్‌ని సొంతం చేసుకుని... మూడో రౌండ్‌కి దూసుకెళ్లింది...

మూడో రౌండ్‌లో  చైనాకి చెందిన వరల్డ్ 19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్‌తో తలబడనుంది పీవీ సింధు. ఇంతకుముందు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అస్మిత చాలిహాని ఓడించిన హ్యాన్ యూయ్‌తో ఇంతకుముందు 2019లో జపాన్ ఓపెన్ ఫైనల్‌లో తలబడింది పీవీ సింధు. ఆ మ్యాచ్‌లో రెండు సెట్లను 9-21, 17-21  తేడాతో చైనీస్ ప్లేయర్‌ని చిత్తు చేసింది సింధు...

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ 500 సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్‌లో బెల్జియంకి చెందిన లియానె టాన్‌పై 21-15, 21-11 తేడాతో సునాయస విజయం అందుకుంది పీవీ సింధు. కొద్ది కాలం గ్యాప్ తర్వాత తిరిగి బ్యాటు పట్టిన సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, తొలి రౌండ్‌లో మరో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కి అర్హత సాధించింది...

థాయ్‌లాండ్ ప్లేయర్, వరల్డ్ నెం.12 ర్యాంకర్ బుసానన్‌ని 21-16, 21-11 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కి అర్హత సాధించిన అశ్మిత చాలిహా, వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది...
 

Follow Us:
Download App:
  • android
  • ios