టీం ఇండియా కోచ్ గా రమేష్ పవార్
జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్ జట్టుతో కలవనున్నాడు.
భారత క్రికెట్ జట్టు కోచ్ గా మాజీ క్రికెటర్ రమేష్ పవార్ ని నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కంగారపడకండి.. రమేష్ పవార్ ని ప్రకటించింది.. కోహ్లీ సేనకు కాదు.. టీం ఇండియా మహిళల జట్టుకి కెప్టెన్ గా .. అది కూడా తాత్కాలిక కెప్టెన్ గా నియమించారు.
కొద్ది రోజుల క్రితం భారత్ మహిళల జట్టు కోచ్ తుషార్ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ క్రీడాకారిణులు కోచ్ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్గా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్ జట్టుతో కలవనున్నాడు. ‘బీసీసీఐ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత జట్టు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తా’ అని పవార్ తెలిపారు.
‘వచ్చే నెలలో భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కోచ్ను ఎంపిక చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశాం. జాతీయ జట్టు లేదా రాష్ట్రానికి చెందిన ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న 55 సంవత్సరాలలోపువారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చిన బీసీసీఐ తెలిపింది. ఈ నెల 20లోగా దరఖాస్తులు పంపాలని సూచించింది. రమేశ్ పవార్ భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు.