ప్రో కబడ్డి 2019: సచిన్ పోరాటం వృధా... గుజరాత్ పై యూపీ అద్భుత విజయం
ప్రో కబడ్డి లీగ్ 2019 లో యూపీ యోదాస్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ జట్టును చిత్తుచేసి పాయింట్స్ టేబుల్ లో మరింత ముందుకు దూసుకెళ్లింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో యూపి యోదాస్ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్కతాలోని నేతాజి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో యూపీ యోదాస్, గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ హోరాహోరీగా పోటీపడ్డాయి. గుజరాత్ ఆటగాడు సచిన్ 10 పాయింట్లతో టాప్ స్కోరగా నిలిచినా విజయం మాత్రం యూపీనే వరించింది. ఆ జట్టు ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడంతో ఈ గెలుపు సాధ్యమయ్యింది.
యూపీ యోదాస్ రైడింగ్ లో 16, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల రూపంలో 1 తో మొత్తం 33 పాయింట్లు సాధించింది. అయితే గుజరాత్ రైడింగ్ లో యూపీ కంటే మెరుగ్గా 17 పాయింట్లు సాధించినా మిగతా విభాగాల్లో మాత్రం వెనుకబడిపోయింది. ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 26 పాయింట్లు మాత్రమే అందుకుంది. దీంతో యూపీ 7 పాయింట్ల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది.
యూపీ ఆటగాళ్లలో శ్రీకాంత్ 6, సురేందర్ 6, రిషాంక్ 5, సుమిత్ 5, నితేశ్ 4 పాయింట్లతో రాణించారు. ఇలా జట్టుమొత్తం సమిష్టిగా ఆడటంతో యూపీ ఈ మ్యాచ్ ను గెలుచుకుంది. గుజరాత్ ఆటగాళ్లలో సచిన్ 10, సునీల్ కుమార్ 7 పాయింట్లతో టాప్ స్కోరర్లుగా నిలిచినా మిగతా ఆటగాళ్లెవరూ కనీస పరుగులు సాధించలేకపోయారు. దీంతో 33-26 పాయింట్ల తేడాతో గుజరాత్ ఓడిపోయింది.