ప్రో కబడ్డి 2019: మారని తెలుగు టైటాన్స్... దబాంగ్ డిల్లీ చేతిలో మరో ఓటమి
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని చవిచూసింది. పాయింట్స్ పట్టికలో టాప్ లో నిలిచిన దబాంగ్ డిల్లీ చేతిలో టైటాన్స్ టీం 8 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక విజయాలతో దూసుకుపోతున్న దబాండ్ డిల్లీ చేతిలో టైటాన్స్ మరో ఓటమిని చవిచూసింది. పూణేలోని శ్రీ శివ్ చత్రపతి రెజ్లింగ్ హాల్లో జరిగిన ఈ మ్యాచ్ లో టైటాన్స్ జట్టుపై 8 పాయింట్ల తేడాతో దబాంగ్ డిల్లీ విజయం సాధించింది.
డిల్లీ ఆటగాళ్లలో నవీన్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి విజయ్ 6, అనిల్ 4, రవిందర్ 4, చంద్రన్ 4 చక్కటి సహకారం అందించారు. దీంతో దబాంగ్ టీం రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 11, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల ద్వారా 2 పాయింట్లతో మొత్తం 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.
తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 12 పాయింట్లతో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. అలాగే రాకేశ్ 5, ఫహాద్ 3, అబోజర్ 3 పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. టైటాన్స్ రైడింగ్ లో 19, ట్యాకిల్స్ లో 9, ఎక్స్ట్రాల ద్వారా 1 ఇలా మొత్తం 29 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో 29-37 పాయింట్ల తేడాతో మరో పరాజయాన్ని తెలుగు టైటాన్స్ తన ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలతో ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన దబాంగ్ డిల్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.