ప్రో కబడ్డి 2019: జైపూర్ కు మొదటి ఓటమి రుచిచూపించి...టాప్ లేపిన దబాంగ్ డిల్లీ
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో మరో రసవత్తర పోరుకుపాటలిపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికయ్యింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న జైపూర్ జట్టు మట్టికరిపించి దబాంగ్ డిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో దబాంగ్ డిల్లీ టాప్ లేపింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న జైపూర్ పింక్ పాంథర్స్ ని మట్టికరిపించి పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరింది. డిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగి 12 పాయింట్లు సాధించి మంచి ఆధిక్యాన్నిచ్చాడు. అలాగే చంద్రన్ రజిత్ కూడా 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇలా వీరిద్దరు రాణించడంతో పింక్ పాంథర్స్ కి ఈ సీజన్లో మొదటి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
డిల్లీ, జైపూర్ రైడర్లు పోటాపోటిగా పాయింట్లు సాధించారు. అయితే డిల్లీ డిపెండర్స్ రాణించి 8 ట్యాకిల్ సాధించగా జైపూర్ కేవలం 3 ట్యాకిల్ పాయింట్స్ తో తేలిపోయింది. అలాగే రెండు సార్లు పాంథర్స్ ను ఆలౌట్ చేసి మరో 4 పాయింట్లను డిల్లీ అదనంగా పొందింది. ఇవే పాయింట్లు జైపూర్ ను ఓడించడానికి తోడ్పడ్డాయి.
జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా 11 ఒక్కడే రాణించాడు. మిగతావారిలో దీపక్ నర్వాల్ పరవాలేదనిపించాడు. కానీ ఇతర ఆటగాళ్లు పాయింట్లు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో జైపూర్ 35-24 పాయింట్ల తేడాతో ఓడిపోవడమే కాదు పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి దిగజారింది. ఐదింట నాలుగు విజయాలు సాధించిన డిల్లీని టాప్ కు చేరగా జైపూర్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది.