ప్రో కబడ్డి 2019: సొంత గడ్డపై బెంగాల్ తొలి విజయం...పోరాడిఓడిన పూణే
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. హెూం గ్రౌండ్ లో పుణేరీ పల్టాన్ ను చిత్తుచేసి విజయాన్ని అందుకుంది.
హోం గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్య బెంగాల్ వారియర్స్ తొలి విజయాన్ని అందుకుంది. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో పుణేరీ పల్టాన్ జట్టుతో తలపడి వారియర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. చివరివరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో స్థానికజట్టు కేవలం 3 పాయింట్ల తేడాతో గెలుపొందింది. పుణేరీ పల్టాన్ చివరివరకు పోరాడినా ఓటమిని చవిచూసింది.
బెంగాల్ ఆటగాళ్లలో మణీందర్ సింగ్ 10, ఇస్మాయిల్ 6, సుఖేష్ హెగ్డే 6, ప్రభంజన్ 5, బల్దేవ్ సింగ్ 5 పాయింట్లతో రాణించారు. మయూర్ 2, రింకు 2 పాయింట్లతో వారియర్స్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా బెంగాల్ జట్టు రైడింగ్ లో 30, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల రూపంలో 1 మొత్తం 42 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది.
పుణేరీ జట్టు కూడా అంత తొందరగా ఓటమిని అంగీకరించలేదు. పంకజ్ 10, మంజిత్ 9 పాయింట్లతో అదరగొట్టినా ఫలితంలేకుండా పోయింది. హదీ 4, గిరీశ్ 3, సుర్జిత్ 2, దర్శన్ 2 పాయింట్లు సాధించారు. అయితే రైడింగ్ లో 21, ట్యాకిల్స్ 12, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల ద్వారా మరో 2 మొత్తం 39 పాయింట్లు సాధించింది. అయినప్పటికి కేవలం 3 పాయింట్లు తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.