దేశం గర్వపడుతోంది.. హాకీ మహిళల జట్టుపై మోదీ..!
మీరు కాంస్యం తేకున్నా.. మాకు బంగారంతో సమానమేనని పేర్కొంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు.
హాకీలో పురుషుల జట్టు కాంస్యం గెలిచింది.. మహిళల జట్టు కూడా కాంస్య పతకంతోనే తిరిగి దేశానికి వస్తారని అందరూ కలలు కన్నారు. కానీ.. అనూహ్యంగా.. బ్రిటన్ చేతిలో ఓటమిపాలై.. కాంస్యం చేజార్చుకోవాల్సి వచ్చింది. కాంస్యం చేజార్చుకున్నప్పటికీ.. భారత మహిళల పోరాటం మాత్రం అద్వితీయమని చెప్పక తప్పదు. నరాలు తెగే ఉత్కంఘతో సాగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడారు. చివరి క్షణంలో ఓటమిపాలయ్యారు.
పతకం చేజారినందుకు జట్టు ఎంత బాధపడిందో.. దేశ ప్రజలుకూడా అంతే బాధపడ్డారు. అయితే.. వారి పోరాట పటిమను మాత్రం అందరూ ప్రశంసిస్తున్నారు. మీరు కాంస్యం తేకున్నా.. మాకు బంగారంతో సమానమేనని పేర్కొంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు.
మహిళల జట్టును చూసి దేశం గర్విస్తోందంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలంపిక్స్ లో మహిళల జట్టు చూపించిన అద్వీతీయ ప్రతిభను ఎవరమూ మర్చిపోలేమన్నారు. జట్టులోని ప్రతి ఒక్క సభ్యురాలు ఎంతో కష్టపడ్డారని మోదీ అన్నారు. జట్టును చూసి దేశం గర్విస్తోందంటూ మోదీ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో.. హాకీ పురుషుల జట్టుతోపాటు మహిళ జట్టును కనపరిచిన ప్రతిభను ప్రశంసించారు.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో బ్రిటన్ కాంస్యం గెలుచుకోగా.. వారు కూడా.. భారత జట్టుపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఇలాంటి ప్రత్యర్థి ఆడటం తమకు గర్వంగా ఉందంటూ వారు పేర్కొనడం విశేషం.