టీం ఇండియా కెప్టెన్ గా కోహ్లీ పనికిరాడా..? మార్చాలని డిమాండ్
ఇక పూర్తి స్థాయి కెప్టెన్కు సిద్ధమా? అన్న ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా రెడీ అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు మాట్లాడాడు
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై వ్యతిరేకత మొదలౌతోందా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఆసియా టోర్నీకి కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో తాత్కలికంగా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కూల్ కెప్టెన్సీతో ఒక్క మ్యాచ్ ఓడకుండా జట్టుకు విజయానందించాడు.
క్లిష్ట సమయాల్లో తను తీసుకునే నిర్ణయాలు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీని గుర్తు చేశాయి. ఈ విషయాన్ని తను కూడా అంగీకరించాడు. తన కెప్టెన్సీపై ధోని ప్రభావం ఎక్కువగా ఉందని, అతని లోని లక్షణాలు తనలో కూడా ఉన్నాయని చెప్పాడు. ఇక పూర్తి స్థాయి కెప్టెన్కు సిద్ధమా? అన్న ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా రెడీ అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు మాట్లాడాడు. దీంతో రోహిత్ శర్మకు లిమిటెడ్ ఓవర్ క్రికెట్ పగ్గాలు ఇవ్వాలని అతని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ మూడుసార్లు టైటిల్ అందించాడని, కోహ్లి మాత్రం ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడని గుర్తు చేస్తున్నారు . రోహిత్ యువజట్టుతోనే నిదహాస్ ట్రోఫీ, ఆసియాకప్ గెలిపించాడని చెబుతున్నారు. కోహ్లి గొప్ప బ్యాట్స్మన్ అని, కానీ కెప్టెన్ మాత్రం కాదంటున్నారు.
అతనికి ఫైనల్ ఫీవర్ కూడా ఉందని, అతని దూకుడు.. కోపం కెప్టెన్స్పై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జట్టు ఎంపికలో, ఫీల్డింగ్ మార్పుల్లో కోహ్లి విఫలమవుతున్నాడని, ఏ సమయంలో ఎవరితో బౌలింగ్ చేయించే విషయంలో కూడా కోహ్లి ఇబ్బంది పడుతున్నారని రోహిత్ ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. దీన్ని విరాట్ ఫ్యాన్స్ సైతం కొట్టి పారేస్తున్నారు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ సాధించిన విజయాలే అతని కెప్టెన్సీకి నిదర్శనమని కౌంటర్ ఇస్తున్నారు.