కరోనా విలయతాండవం: ట్వీట్లు, వీడియోలతో సరి.. చిల్లిగవ్వ విదల్చని క్రీడాకారులు
కరోనా మహమ్మారి విలయ తాండవానికి ప్రస్తుతం ప్రపంచం నిలువెల్లా వణికిపోతోంది. దేశాలకు దేశాలు లాక్డౌన్లు ప్రకటించి, వైరస్ను నిలువరించేందుకు శ్రమిస్తున్నాయి. మానవాళి అంతా ఏకమైతేనే ఈ వైరస్ను తరిమి కొట్టగలమని, అలాగే ఆర్థిక స్తోమత ఉన్నవారు పేదలను ఆదుకోవాలని పలువురు పిలుపునిస్తున్నారు
కరోనా మహమ్మారి విలయ తాండవానికి ప్రస్తుతం ప్రపంచం నిలువెల్లా వణికిపోతోంది. దేశాలకు దేశాలు లాక్డౌన్లు ప్రకటించి, వైరస్ను నిలువరించేందుకు శ్రమిస్తున్నాయి. మానవాళి అంతా ఏకమైతేనే ఈ వైరస్ను తరిమి కొట్టగలమని, అలాగే ఆర్థిక స్తోమత ఉన్నవారు పేదలను ఆదుకోవాలని పలువురు పిలుపునిస్తున్నారు.
ఇప్పటికే పలువురు సంపన్నులు, సెలబ్రెటీలు ప్రజల శ్రేయస్సు కోసం భారీగా విరాళాలు ఇస్తున్నారు. భారతదేశంలోనూ లాక్డౌన్ కారణంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల పరిస్ధితి ఈ సమయంలో క్లిష్టంగా మారింది. కొందరు మనసున్న సెలబ్రిటీలు పేదసాదలను ఆదుకునేందుకు గాను ముందుకు వస్తున్నారు.
దాచుకోవద్దు.. హిందూ, ముస్లిం అని ఆలోచించొద్దు: తోటివారిని ఆదుకోవాలన్న అక్తర్
కొంతమంది తమకు అందుబాటులో ఉన్నవారికి సాయం చేస్తుండగా.. ఇంకొందరు ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్నారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సాయం చేయడానికి ముందుకు వస్తుండగా.. క్రీడాకారులు మాత్రం ట్వీట్లకే పరిమితమవ్వడంతో విమర్శల పాలవుతున్నారు.
ఇండియన్ స్టార్ రెజ్లర్ బంజరంగ్ పూనియా తన 6 నెలల జీతాన్ని హర్యానా ప్రభుత్వ నిధికి విరాళంగా ప్రకటించాడు. రైల్వేలో పనిచేస్తున్న అతను తన పెద్ద మనసు చాటుకోగా.. కోట్ల రూపాయలు ఆర్జించే క్రికెటర్లు, బ్యాడ్మింటన్ స్టార్లు మాత్రం ఈ రోజు వరకు నయా పైసా కూడా విరాళం ఇవ్వలేదు.
Also Read:సీఎం కేసీఆర్ ని కలిసిన హీరో నితిన్.. ఆత్మీయ ఆలింగనం(ఫోటోస్)
క్రికెటర్లను దేవుళ్లుగా భావించే అభిమానులు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని లేదా అంటూ పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రూ.1,690 కోట్ల బ్రాండ్ వాల్యూ ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పైసా కూడా విరాళం ఇవ్వలేదు.
కోహ్లీయే కాదు, రోహిత్ శర్మ, ధోని, ధావన్, సచిన్, సెహ్వాగ్, పీవీ సింధు వంటి స్టార్లు దేశానికి అండగా నిలబడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకొందరైతే రెజ్లర్ పూనియాను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సలహాలిస్తున్నారు.