రాయుడి వీడ్కోలు... ఎమ్మోస్కే వివరణ సరిగాలేదన్న అజహరుద్దీన్
రాయుడు క్రికెట్ కి వీడ్కోలు పలకడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణ పట్ల అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు అస్సలు బాలేదని టీం ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. రాయుడు క్రికెట్ కి వీడ్కోలు పలకడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణ పట్ల అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచకప్ జట్టులో ఎవరైనా గాయపడితే స్టాండ్ బైగా ఉన్న ఆటగాడినే కదా తీసుకోవాలని ప్రశ్నించారు. 2019 జనవరి వరకు రాయుడుకి టీం ఇండియాలో క్రమం తప్పకుండా నాలుగో స్థానం కేటాయించారు. దీంతో రాయుడు ప్రపంచకప్ పై చాలా ఆశలు పెంచుకున్నారు.చివరకు జట్టు ప్రకటించే సమయానికి రాయుడుని పక్కన పెట్టి విజయశంకర్ కి అవకాశం ఇచ్చారు.
దీనిపై వివాదం చెలరేగడంతో రాయుడిని స్టాండ్ బై ఆటగాడిగా ప్రకటించారు. తర్వాత ప్రపంచకప్ లో భాగంగా ధావన్, విజయ్ శంకర్ గాయపడితే పంత్, మయాంక్ను ఇంగ్లాండ్కు పంపించారు. రాయుడికి మళ్లీ మొండిచేయి చూపించారు. మనస్తాపానికి గురైన అతడు ప్రపంచకప్ జరుగుతుండగానే ఆటకు శాశ్వతంగా వీడ్కోలు పలికేశాడు.
దీనిపై ఇటీవల ఎమ్మెస్కే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఆటగాళ్లు ఎలాంటి భావోద్వేగానికి గురవుతారో సెలక్షన్ కమిటీ అంతే భావోద్వేగం చెందుతుంది. మా ఎంపికలో వివక్ష లేదు. జట్టు అవసరాల మేరకే విజయ్ శంకర్, రిషభ్పంత్, మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశాం’’ అని అన్నారు. కాగా... ఈ వివరణ పట్ల సంతృప్తి చెందని అజహరుద్దీన్ పై విధంగా స్పందించారు.