వంద వికెట్లు, వెయ్యి పరుగులు...టీ 20ల్లో మహిళా క్రికెటర్ సరికొత్త రికార్డ్
అంతర్జాతీయ టీ 20ల్లో వంద వికెట్లు, వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా ఎల్లీస్ పెర్రీ నిలిచారు. వరల్డ్ టీ20లో భాగంగా గత నవంబర్లో ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ నటెల్లీ స్కీవర్ వికెట్ సాధించడం ద్వారా వంద వికెట్ల క్లబ్లో చేరారు.
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ నయా చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ 20ల్లో వంద వికెట్లు, వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా ఎల్లీస్ పెర్రీ నిలిచారు. ఇంత వరకు ఈ రికార్డు అటు పురుషుల క్రికెట్ లోనూ, ఇటు మహిళల క్రికెట్ లోనూ ఎవరూ చేయకపోవడం గమనార్హం.
గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 1498 పరుగులు సాధించగా, 98 వికెట్లు సాధించాడు. పెర్రీ మాత్రం వంద వికెట్లు తీసి రికార్డు సాధించారు. వరల్డ్ టీ20లో భాగంగా గత నవంబర్లో ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ నటెల్లీ స్కీవర్ వికెట్ సాధించడం ద్వారా వంద వికెట్ల క్లబ్లో చేరారు.
తాజాగా అదే ఇంగ్లండ్తో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆల్ రౌండర్ పెర్రీ 47 పరుగులు సాధించి అజేయంగా నిలిచారు. దాంతో అంతర్జాతీయ టీ20లో వెయి పరుగుల మార్కును అందుకున్నారు.ఇంగ్లండ్ నిర్దేశించిన 122 పరుగుల ఛేదనలో ఆసీస్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
టెస్టుల్లు, వన్డేలు,టీ20ల ఆధారంగా జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్ను ఇప్పటికే ఆసీస్ కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో పెర్రీ ఏడు వికెట్లు సాధించారు. ఫలితంగా వన్డే ఫార్మాట్లో ఒక మ్యాచ్లో అత్యధిక వికెట్లు సాధించిన తొలి ఆసీస్ మహిళా క్రికెటర్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇందులో తొలి రెండు టీ2లను ఆసీస్ చేజిక్కించుకుంది. బుధవారం చివరిదైన మూడో టీ20 జరుగనుంది.