సెంచరీలు: విరాట్ కోహ్లీకి సచిన్ టెండూల్కర్ బంపర్ ఆఫర్
వన్డేల్లో తన రికార్డును బద్దలు కొట్టి, యాబై సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీతో తాను ఓ షాంపైన్ బాటిల్ పంచుకుంటానని టెండూల్కర్ సోమవారం చెప్పాడు.
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వన్డేల్లో కోహ్లీ 35 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
అగ్రస్థానంలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద 49 సెంచరీలు నమోదై ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేవారు ఉండరని నమ్ముతూ వచ్చారు. కానీ విరాట్ కోహ్లీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు.
వన్డేల్లో తన రికార్డును బద్దలు కొట్టి, యాబై సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీతో తాను ఓ షాంపైన్ బాటిల్ పంచుకుంటానని టెండూల్కర్ సోమవారం చెప్పాడు. తాను అతనికి షాంపైన్ బాటిల్ పంపించబోనని, అతనితో దాన్ని తాను పంచుకుంటానని అన్నారు. ముంబైలో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు వన్డేల్లో 35 సెంచరీలు చేశారు. ఆ రకంగా ఆయన ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ (30), శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య (28)లను దాటేశారు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొడుతాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.