అత్యాచార ఘటనలపై నరేంద్ర మోడీ మాట ఇదీ
ప్రజలు తమ కూతుళ్లను గౌరవించి, కుమారులను బాధ్యతగా పెంచాలని, తద్వారా సురక్షితమైన వాతావారణాన్ని కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
మండ్ల (మధ్యప్రదేశ్): అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసిందని, అయితే ప్రజలు తమ కూతుళ్లను గౌరవించి, కుమారులను బాధ్యతగా పెంచాలని, తద్వారా సురక్షితమైన వాతావారణాన్ని కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
మంగళవారం మండ్ల జిల్లాలోని జాతీయ పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంగళవారంనాడు ప్రసంగించిన మోడీ అత్యాచార ఘటనలపై స్పందించారు. మహిళలు, బాలికల రక్షణ కోసం సామాజిక ఉద్యమం రావాలని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మైనర్లపై అత్యాచారాలు చేసేవారికి మరణదండన విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ గురించి ప్రస్తావించారని, ఆ మాటలకు తాను హర్షధ్వానాలు వ్యక్తం కావడం గమనించానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల మాటలను విని నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అందువల్లనే మైనర్లపై అత్యాచారాలు చేసేవారికి మరణదండన విధించే ఆర్డినెన్స్ ను జారీ చేసిందని చెప్పారు.
కుటుంబాలు కూతుల్లను గౌరవించడాన్ని పెంపొందించాలని, తమ కుమారులను బాధ్యతగా పెంచాలని, దానివల్ల కూతుళ్ల రక్షణ కష్టమేమీ కాదని, అందుకు మనం సామాజిక ఉద్యమం నిర్వహించాలని ఆయన అన్నారు.