సూరత్ రేప్ కేసులో నిందితుడి ట్విస్ట్: రేప్ చేయలేదు, గానీ.....
సూరత్ రేప్ కేసులో నిందితుడి ట్విస్ట్: రేప్ చేయలేదు, గానీ.....
సూరత్: సూరత్ 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను రేప్ చేయలేదని ప్రధాన నిందితుడు హర్షథ్ సహాయ్ గుర్జార్ పోలీసులతో చెప్పాడు. ఆమెపై తాను అత్యాచారం చేయలేదని, తీవ్రంగా హింసించిన మాట వాస్తవమేనని అతను అన్నాడు.
బాలిక మర్మాయవం వద్ద ప్రాణ హాని కలిగించే గాయం ఉందని, అయితో గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక తెలియజేస్తోందని సూరత్ పోలీసు కమిషనర్ సతీష్ శర్మ అన్నారు. బాలిక శరీరంపై మొత్తం 87 గాయాలున్నాయి. మర్మాయవయంపై కూడా గాయాలు ఉన్నాయి.
బాలిక ముఖంపై గడ్డకట్టిన కన్నీటి చారికలు, బురద ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. వైద్య నివేదికలో అత్యాచారం జరిగినట్లు రుజువు కాకపోయినా మృతురాలు మైనర్ కాబట్టి అత్యాచారం కిందికే వస్తందని శర్మ చెప్పారు.
గుర్జార్ ను ఈ నెల 20వ తేదీన రాజస్థాన్ లోని అతడి స్వస్థలం గంగాపూర్ లో అరెస్టు చేశారు. అతడి సోదరుడు హరిసిన్హాతో పాటు మరో ఇద్దరిని అంతకు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్జార్ కు సహకరించిన హరి ఓం అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాధితురాలి తల్లిని మార్చి 20వ తేదీన ఆమె సమక్షంలోనే గుర్జార్, హరి ఓం కలిసి హత్య చేశారు. తన తల్లి హత్య కేసులో బాలిక సాక్ష్యం చెబుతుందనే ఉద్దేశంతో బాలికను గుర్జార్ తన ఇంట్లో నిర్బంధించాడు. లైంగిక చిత్రహింసలకు గురి చేస్తూ తీవ్రంగా కొట్టడంతో బాలిక నోరు తెరవలేకపోయింది.
ఈ నెల 5వ తేదీన బాలిక తీవ్రంగా ఏడ్వడం ప్రారంభించింది. దాంతో ఆమె నోట్లో గుర్జార్ దుస్తులు కుక్కాడు. అయినా ఏడ్పు ఆపలేదు. దాంతో గొంతు నులిమి చంపేసినట్లు గుర్జార్ అంగీకరించాడు. అదే రోజు రాత్రి బాలిక శవాన్ని తీసుకుని వెళ్లి పండేసరా వద్ద రొడ్డు పక్కన తుప్పల్లో పడేశాడు. సిసిటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.