అలిపిరి రిపీట్ అంటున్నారు, ప్రశ్నిస్తే చంపేస్తారా: బిజెపిపై కేఈ ఫైర్
అలిపిరి రిపీట్ అంటున్నారు, ప్రశ్నిస్తే చంపేస్తారా: బిజెపిపై కేఈ ఫైర్
అమరావతి: బిజెపిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ పైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి సంఘటన రిపీట్ అవుతుందని బిజెపి నాయకులు అంటున్నారని, మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన అన్నారు.
మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇండియా అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీపై దేశవ్యాప్తంగా ప్రజలకు విరక్తి కలిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపికి జగన్, పవన్ కల్యాణ్ సాయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
జగన్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవిపై ఉన్న ఆసక్తి జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలపై లేదని ఆయన విమర్శించారు. బిజెపి, వైసిపి కుట్రలో పవన్ కల్యాణ్ పావుగా మారారని అన్నారు. కేసుల నుంచి బయటపడడానికే జగన్ మోడీ భజన చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికలతో రాష్ట్రంలో నగదు కొరత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీఎ నుంచి బయటకు వచ్చినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వైసిపి, బిజెపి లాలూచీ రాజకీయాలతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు.