మహిళ శవాన్ని కాల్చి మంచానికి కట్టేశారు: రేప్ అనుమానం
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో కాలిన స్థితిలో ఓ మహిళ శవం మంచానికి కట్టేసి ఉంది. అంతకు ముందు ఆమెపై కాల్పులు కూడా జరిపినట్లు భావిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి,
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మహిళను నిప్పు పెట్టి కాల్చేసి మంచానికి కట్టేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
సంఘటనా స్థలంలో ఖాళీ కాట్రిడ్జ్ లు కనిపించాయి. ఆమెపై కాల్పులు జరిపి ఉండవచ్చునని భావిస్తున్నారు. గ్రామ శివారులోని ట్యూబ్ వెల్ లో గ్రామస్థులకు ఆ శవం కనిపించింది. మహిళ ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళను గుర్తించడానికి డిఎన్ఎ శాంపిల్స్ సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సాధ్యమైనంత త్వరగా మహిళను గుర్తించి, కేసులో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.