మంత్రిగారి రాసలీలల కేసు.. గోవాలో యువతి..!
బెంగళూరులో ఆమె ఉంటున్న ఇంటి యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది.
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీల కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. కాగా.. మంత్రితో పాటు ఆ సీడీలో కనిపించిన యువతిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును సిట్ అధికారులకు అప్పగించారు. దీంతో.. ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి నోటీసులు జారీ చేశారు.
విజయపుర (బిజాపుర) జిల్లా నిడగుంది పట్టణంలోని ఆమె ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇంటికి తాళాలు వేసి ఉంది. అలాగే సదరు యువతి స్నేహితులు, బెంగళూరులో ఆమె ఉంటున్న ఇంటి యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది.
బెంగళూరులోని ఆర్టీ నగరలో అద్దె ఇంట్లో ఉంటున్న యువతి రాసలీలల వీడియోలు విడుదలయిన తరువాత గోవాకు వెళ్లిపోయింది. ఆ సమయంలోనే తన ఇంటి యజమానులకు ఫోన్చేసి, తనవల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యాయని, తనను క్షమించాలని కోరినట్లు తెలిసింది. త్వరలో తిరిగి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పింది.
తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని శనివారం యువతి వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశామని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. యువతికి రక్షణ కల్పించాలని హోం మంత్రిని కోరతామన్నారు. ఈ కేసు వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని, ఆత్మహత్యాయత్నం కూడా చేశానని యువతి చెప్పడం ఆందోళనకరమన్నారు.