యూనివర్సిటీ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్.. బాయ్ఫ్రెండ్ను చితకబాదిన దుండగులు
కర్ణాటకలో ఓ యూనివర్సిటీ విద్యార్థినిపై మంగళవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగింది. ఇద్దరు విద్యార్థులు చాముండి హిల్స్ దగ్గర హెలిప్యాడ్ సమీపంలోని అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తున్నప్పుడు ఓ గ్యాంగ్ వారి చుట్టూ చేరి డబ్బులివ్వాలని బెదిరించినట్టు తెలిసింది. అనంతరం బాయ్ఫ్రెండ్ను చితకబాది యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్టు సమాచారం.
బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. ఓ యూనివర్సిటీ స్టూడెంట్పై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె బాయ్ ఫ్రెండ్ను చితకబాదారు. అనంతరం పరారయ్యారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మైసూరులోని యూనివర్సిటీ విద్యార్థిని, ఆమె మిత్రుడితో కలిసి నగర శివారులోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం చాముండి హిల్స్కు వెళ్లారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు వారిని చుట్టుముట్టారు. ముందు డబ్బులు ఇవ్వమని బెదిరించినట్టు తెలిసింది. కానీ, అందుకు వారు తిరస్కరించారు. దీంతో గ్యాంగ్లోని ఇద్దరు యువతిని రేప్ చేసినట్టు సమాచారం. మిగతా దుండగులు యువకుడిని చావబాదినట్టు తెలిసింది.
బాధితురాలు రాత్రి 1.30గంటల ప్రాంతంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. పోలీసులు సెక్షన్ 376-డీ కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఘటనపై స్పందిస్తూ ఎఫ్ఐఆర్ నమోదైందని వివరించారు. అధికారులు ఇప్పటికే మైసూరు చేరుకున్నారని, తానూ రేపు అక్కడికి వెళ్తున్నట్టు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు మంగళవారం రాత్రి 7.30 గంటలకు చాముండి హిల్స్ సమీపంలోని హెలిప్యాడ్ దగ్గరి అటవీ ప్రాంతాన్ని సందర్శించారని, అదే సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు.