కేజ్రీ.. ఎల్జీ మధ్యలోకి రాజ్నాథ్
కేజ్రీ.. ఎల్జీ మధ్యలోకి రాజ్నాథ్
తన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత నాలుగు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు చేస్తున్న సమ్మె విరమించేలా చొరవ తీసుకోవాలని.. అలాగే ప్రజల ఇంటి వద్దకు రేషన్ సామాగ్రిని అందించే పథకానికి ఆమోదముద్ర వేయాలని కోరుతూ కేజ్రీ ఎల్జీని కలిసేందుకు రాజ్ నివాస్కు వెళ్లారు.
అయితే ఎంతసేపు వేచి చూసినా లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై కేజ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన మంత్రి వర్గ సహచరులతో కలిసి రాజ్నివాస్లో దీక్షకు దిగారు. నాలుగు రోజులు గడుస్తున్నా కేంద్రం నుంచి గానీ... ఎల్జీ నుంచి గానీ సానుకూల స్పందన రాకపోవడంతో కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన దీక్షకు మద్ధతుగా.. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ.. ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలో నిరసనకు దిగారు.
వివాదం మరింత ముదురుతుండటంతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.. నిన్న సాయంత్రం కేజ్రీవాల్, ఎల్జీ బైజాల్తో సమావేశమై సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ముగ్గురు కలిసి ఏం చర్చించుకున్నారు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.