నవరాత్రి ఉత్సవాలకు వెళ్లి వస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన జరిగింది. నవరాత్రి ఉత్సవాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.
బుధవారం రాత్రి నవరాత్రి ఉత్సవాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కిడ్నాప్ చేసి యువతిపై ముగ్గురు వ్యక్తులు సామాహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
పాన్వాడి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసు సూపరింటిండెంట్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ ఇంటి వెనక ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి యువతిపై అత్యాచారం చేశారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.