రాజ్యసభకు సుష్మా, అద్వానీ, జోషీ..మోడీ, షా వ్యూహం
ప్రధాని నరేంద్రమోడీ ఈసారి సీనియర్లకు సముచిత స్థానం కల్పించలేదన్న వార్తల నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం నష్ట నివారణా చర్యలు చేపట్టింది.
ప్రధాని నరేంద్రమోడీ ఈసారి సీనియర్లకు సముచిత స్థానం కల్పించలేదన్న వార్తల నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం నష్ట నివారణా చర్యలు చేపట్టింది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
వయసు కారణంగా అద్వానీ, జోషీలు పోటీకి నిరాకరించగా, అనారోగ్యం కారణంగా మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పోటీకి దూరమయ్యారు. దీంతో వీరిని పెద్దల సభకు పంపాలని కమలనాథులు యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
త్వరలో రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆయా స్థానాల ద్వారా సీనియర్లను రాజ్యసభకు పంపాలని మోడీ, షా భావిస్తున్నారు. కాగా 75 ఏళ్లు పైబడిన వాళ్లను లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని బీజేపీలో నిబంధన. దీంతో సీనియర్లను పోటీ నుంచి తప్పించారు.
కాగా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఎస్ జైశంకర్, రాంవిలాస్ పాశ్వాన్లను కూడా రాజ్యసభకు పంపనున్నారు. అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం కూడా మరో రెండు నెలల్లో ముగియనుంది.